మూడో రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. శాంతిపురంలో మహిళలతో నిర్వహించిన నారా లోకేష్ ముఖాముఖిలో వారు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. పన్నులు విపరీతంగా పెంచి అమ్మ ఒడి ఇచ్చాం అంటున్నారని వాపోయారు. అమ్మ ఒడిలో అనేక సాకులు చెప్పి డబ్బులు కట్ చేసి ఇస్తున్నారని అన్నారు. ఈ ఏడాది అమ్మ ఒడి కూడా పడలేదని చెప్పారు.


‘‘నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర, కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, బస్ ఛార్జీలు ఇలా మాపై ప్రభుత్వం విపరీతంగా భారాన్ని పెంచేసింది. వచ్చే అరకొర ఆదాయంతో బతకడం కష్టంగా మారింది. డ్వాక్రా సంఘాలను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. పొదుపు సొమ్ములు కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఎంతో మంది పెన్షన్లు రద్దు చేస్తున్నారు. బయట మా సమస్యల గురించి మాట్లాడితే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నా’’రంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.


భరోసా ఇచ్చిన లోకేశ్
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పారు. మహిళలకు భద్రత కొరవైంది జగన్ ఎక్కడ..? నియోజకవర్గంలో ముగ్గురు యువతులపై అత్యాచారాలు జరిగాయి. వాలంటీర్లు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకూ వారిపై చర్యలు తీసుకోలేదు. జగన్ పాలనలో మహిళలకు భద్రత - భరోసా లేదు. మహిళల తాళి బొట్లు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. మద్యపాన నిషేదం తరువాత ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు. ఆఖరికి మందు బాబులను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ రెడ్డి. విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని జగన్ రెడ్డి తయారు చేస్తున్నాడు. 


జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు. ఇప్పడు అమ్మ ఒడి ఇస్తున్నారా? ఇప్పుడు ఏకంగా అరకొరగా ఇచ్చే అమ్మ ఒడి కూడా ఏడాది ఎగొట్టారు. 45 ఏళ్లకే మహిళలకు పెన్షన్ అన్నారు ఇచ్చారా..? ఎన్నికల్లో అన్ని పెంచుకుంటూ పోతా అన్నారు. అందరూ సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారు అంటుకుంటే పన్నులు పెంచారు. కరెంట్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా అన్ని పెంచుకుంటూ పోతున్నారు. దిశ చట్టం అంటూ మహిళల్ని మోసం చేశారు జగన్ రెడ్డి. 21 రోజుల్లో ఉరి శిక్ష అన్నారు. దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు, స్కూటర్లు ఉన్నాయి కానీ దిశ చట్టమే లేదు.


జగన్ రెడ్డి ఎంత మోసగాడో అర్దం చేసుకోండి. మహిళలు ఎంతో జాగ్రత్తగా దాచుకొనే సొమ్మును జగన్ రెడ్డి కొట్టేస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరకుల ధరలు తగ్గించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం. జగన్ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు. గాజులు వేసుకున్నావా అని ఒక మంత్రి, చీర పంపిస్తా అని ఒక మంత్రి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. గాజులు, చీర పంపిస్తే ఆనందంగా తీసుకుంటా నా అక్కచెల్లెమ్మలకి ఇచ్చి కాళ్ళు మొక్కుతా. వైసిపి నాయకుల తీరువలన రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయి.. చట్టాలు, శిక్షలు కంటే సమాజంలో మర్పుతోనే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థి దశ నుండి మహిళల్ని ఎలా గౌరవించాలో నేర్పించాలి. టిడిపి అధికారం వచ్చిన తరువాత విద్యార్ధి దశ నుండే మహిళల గొప్పతనం, త్యాగాలు, కష్టాలు తెలిసే విధంగా ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతాం. మహిళల కు భద్రత - భరోసా కల్పిస్తాం.’’ అని నారా లోకేశ్ భరోసా కల్పించారు.