MLA Roja Comments On New Car: ఎమ్మెల్యే రోజా ఖరీదైన మెర్సిడిస్ బెంజ్ కారు కొన్నారని కొద్ది వారాలుగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రూ.కోటిన్నర విలువైన ఆ కారును మంత్రి రోజా లంచాలు తీసుకొని కొని తన కుమారుడికి గిఫ్ట్ ఇచ్చారని తెలుగు దేశం నేతలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. అయితే, ఈ విమర్శలపైన మంత్రి రోజా స్పందించారు. తాను ఇప్పటికి 150 సినిమాలు హీరోయిన్ గా చేశానని, జబర్దస్త్ సహా టీవీ షోల్లో కనిపించి ఆ వచ్చిన డబ్బుతోనే కొనుక్కున్నానని రోజా అన్నారు. ఈ రోజుల్లో చిన్న చిన్న యాంకర్లకు కూడా ఖరీదైన కార్లు ఉంటున్నాయని, తనకు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. తాను జబర్దస్త్ లాంటి షోల్లో జడ్జిగా చేసినందుకు రూ.లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్నారనే వాదనపైనా స్పందించారు.


తాను జబర్దస్త్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నానని అంశం, తన అకౌంట్లు, కడుతున్న ఐటీ పన్నులు చూస్తేనే తెలుస్తుందని వివరణ ఇచ్చారు. తాను లంచాలు తీసుకొని కారు కొన్నానని జనసేన, టీడీపీ నాయకులు ప్రచారం చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని కొట్టిపారేశారు. ఇవేం తెలియని చదువురాని వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.


ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపైనా స్పందన
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఎంపీకి సంబంధించి వైరల్ అయిన ఆ వీడియో నిజమో కాదో తెలియదని మంత్రి రోజా అన్నారు. వీడియోకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని స్పందించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగుదేశం పార్టీపైన విమర్శలు చేశారు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై ఎన్నో అకృత్యాలు జరిగాయని, అయినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో కూడా గతంలో విద్యార్థినులు వేధింపులకు గురయ్యారని, వారిపై ఒక్క కేసు కూడా అప్పుడు పెట్టలేదని రోజా ఆరోపించారు. అలాంటప్పుడు చంద్రబాబు, లోకేశ్ వంద సార్ల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీకి సంబంధించిన వీడియో నిజమో, కాదో తెలుసుకోకుండా టీడీపీపై విమర్శలు చేయడం సరికాదని రోజా అన్నారు. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


అయితే, ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా కనిపిస్తున్న ఆ వీడియో బయటికి రావడం విపక్షాల విమర్శలకు బాగా అవకాశం ఇచ్చినట్లయింది. ఆ వీడియో మార్ఫింగ్ చేయలేదని, అత్యంత సహజంగానే ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. టీడీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలను ఎక్కుపెడుతున్నారు. కొంత మంది మీమ్స్ చేసి కామెడీ తరహాలో క్లిప్స్ రూపొందించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అవి మరీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.