జనమంటే జగన్‌కు ప్రేమ లేదని... కక్ష ఒక్కటే ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ. లోకేష్‌ చేస్తున్న యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన బాలకృష్ణ... హిందూపురంలోని గార్లదిన్నెలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్, వైసీపీ పాలనపై డైలాగులు పేల్చారు. 


రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే వైఎస్‌ఆర్‌సీపీ ఉందని విమర్శించారు నందమూరి బాలకృష్ణ. ఏపీలో ఉంది ఓ చెత్త ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా తాత్సారం చేశారన్నారు. ఇన్నేళ్లు వాటిని మెంటెయినెన్స్‌ లేకపోవడంతో అవి పాడైపోయే స్థితికి చేరుకున్నాయన్నారు. వాటిని ఇప్పుడు ఇచ్చినా తీసుకోవదని బాలకృష్ణ సూచించారు. అవి కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయని.. తీసుకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతాయన్నారు. 


అసలు ప్రజలంటే జగన్‌కు ఎలాంటి ప్రేమ లేదని... ఆయన స్వీట్‌గా మాట్లాడుతూంటే  ప్రేమ అనుకోవద్దన్నారు బాలయ్య. జనాలపై జగన్‌కు ఉన్నది కక్ష మాత్రమే అన్నారు. అదో సైకోతత్వం అని హాట్ కామెంట్స్ చేశారు. తాను సైకాలజీ చదవిలేదని కానీ తనకు మించిన సైకియాట్రిస్ట్ లేడని అభిప్రాయపడ్డారు. ఎవరి నుంచీ సలహాలు తీసుకోవడం ఈ ప్రభుత్వానికి అసలు నచ్చదన్నారు బాలకృష్ణ. ప్రభుత్వంలో ఉన్న సలహాదారులంతా ఓ వర్గానికి చెందిన వారేనని... వారి సలహాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందేనన్నారు. 


మీడియా సమావేశం అనంతరం లోకేష్‌తో కలిసి పాదయాత్ర చేపట్టారు బాలకృష్ణ. గంజాయి వద్దు బ్రో అనే స్లోగన్‌తో టోపీలు ధరించి పాదయాత్ర చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు