టీడీపీ సర్పంచ్‌పై బంగారుపాళ్యం పోలీసులు జూలూం ప్రదర్శించారు. బంగారుపాళ్యం సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ నిధుల‌ విడుదల చేయాలంటూ బిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన టీడీపీ సర్పంచ్ కోకా ప్రకాష్ నాయుడుపై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు బలవంతంగా పోలీసు స్టేషనుకు లాక్కెళ్లారు. ఈయన చిత్తూరు జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. టీడీపీ సర్పంచ్ ను విచక్షణ రహితంగా కొట్టడంతో సొమ్మసిల్లి పడిపోయాడని స్థానిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 


దీంతో బంగారుపాళ్యం పోలీసు స్టేషను ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ ‌మురళిమోహన్ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం పోలీసు స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు.. నేతలు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే శవంగా మార్చేస్తారా అంటూ మురళీ మోహన్ మండిపడ్డారు. టీడీపీ సర్పంచ్ ప్రకాష్ నాయుడుపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకునే వరకూ తాము రోడ్డుపైనే బైఠాయిస్తాంమంటూ హెచ్చరించారు. టీడీపీ‌ సర్పంచ్ ప్రకాష్ నాయుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన్ను బంగారుపాళ్యం ‌ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి‌ వైద్యం అందిస్తున్నారు.