Tiger Wandering: అనకాపల్లి జిల్లా వాసులకు పులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత 20 రోజులుగా భయంతో ప్రజలు ఇళ్ల నుంచి వచ్చేందుకు కూడా వణికిపోతున్నారు. గతంలో బవులవాడలో ఆవుదూడను చంపి తిన్న ఆ పులి మరోసారి కే.కోట పాడు మండలం అర్లీ అనే గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. అయితే ఆదివారం రోజు ఈ ఘటన జరిగినట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. 


బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలు..


గత రెండు రోజులుగా సమీప కొండ ప్రాంతంలో సంచరించడంతో  గ్రామస్తులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు పెద్ద పులి పాద ముద్రలు సేకరించారు. పులి దాడిలో మృతి చెందిన ఎద్దుకు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అయితే అడవుల్లోకి వెళ్లి ఆహారం దొరక్క మళ్లీ వెనక్కి వచ్చి వుండచ్చని అధికారులు భావిస్తున్నారు.


ప్రాణనష్టం జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు..


తూర్పు గోదావరి జిల్లా నుంచి ఈ ప్రాంతానికి పులి వచ్చినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పాద ముద్రలో ఆధారంగా నాలుగేళ్ల వయసున్న రాయల్ బెంగాల్ పెద్దపులిగా తేల్చారు. ఇది చాలా తెలివైందని.. అయితే పులి సంచారంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ వేసి ప్రత్యేక బృందాలను ఇక్కడ పెట్టినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఇది పగలంతా విశ్రాంతి తీస్కొని రాత్రి వేళలో ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించారు. 


బాధితులకు నష్టపరిహారం.. 


అయితే పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని అటవీ శాఖ అధికారులు వివరించారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమాత్రం ఆద మార్చినా పులి ప్రాణాలు తీసేదాక వదలని... అది దృష్టిలో ఉంచుకొని ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అయితే ఆ పులి ఏ దిశగా వెళ్తుందనేది అంచనా వేస్తున్నట్లు వివరించారు. పెద్దపులి సంచారం కోసం డ్రోన్లు కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. జీపీఎస్ సిస్టం కెమెరా ఆధారంగా పెద్దపులి ఆచూకీ తెలుసుకుంటామన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అలాగే పెద్దపులి వల్ల నష్టపోయిన వారికి పరిహారం కూడా చెల్లిస్తామని వివరించారు. 


మొదటి సారి ఈ ప్రాంతంలో పులి సంచరించిందని తెలిసినప్పటి నుంచి అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే జిల్లా అటవీ శాఖ అధకారలి అనంత శంకర్ దాదాపు పది కిలోమీటర్లు నడిచి పులి ఆనవాళ్లను గుర్తించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి ఏం భయపడొద్దని తెలిపారు. కానీ మరోసారి పులి సంచరించడంపై స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.