AP Assembly Budget Meeting :   ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి బడ్జెట్ సమావేశాలు జరపనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. అయితే ఈసారి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. మొదటి రోజున గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం ఉంటాయి. రెండో రోజు సంతాప తీర్మానాలు, వాయిదా ప్రకటన ఉంటాయి.  రెండో విడత సమావేశాలు మార్చి 6న ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాలు 13 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే, అసెంబ్లీ సమావేశాలు రెండు విడతల్లో జరపనున్నట్టు చెబుతున్నారు. 


గతం కంటే మరో రూ. 20 వేల కోట్ల అదనపు లెక్కలతో బడ్జెట్ 


బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశ పెడతారన్నదానిపై స్పష్టత లేదు. రెండో విడత సమావేశాల్లోనే పెట్టే అవకాశం ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ 2,56,256 కోట్తో  బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈసారి అంతకు మించి బడ్జెట్‌ లెక్కలు ఉండాలని మంత్రి బుగ్గన అధికారులకు సూచనలు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ 2.65 లక్షల కోట్ల నుంచి2.75 లక్షల కోట్ల రూపాయల మధ్య  ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు అంచనాలు రూపొందించుకోనున్నారు. 


ఈ సారి సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకూ నిధులు


ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు.. అవసరమైన మేరకే.. నిధులను కోరాల్సిందిగా సూచిస్తున్నారు.  గత ఏడాది తరహాలోనే సంక్షేమానికి పెద్ద పీట వేయాలని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తుంది. అంతే కాదు వచ్చేది అంతా ఎన్నికల సమయమే కాబట్టి.. సంక్షేమానికి ఒకింత ఎక్కువే ఇవ్వాలి కాని, లోటు ఉండొద్దని ఇప్పటికే ఆర్ధిక శాఖ అధికారులకు ప్రభుత్వ పెద్దలు సూచించారు. ఇక అభివృద్ధి విషయంలోనూ ఈసారి ఎక్కువగా ఫోకస్‌ పెట్టక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.అత్యంత ప్రాదాన్యత కలిగిన రోడ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రోడ్లకు భారీగానే నిధుల కేటాయింపు జరపాల్సి ఉంటుంది. అలాగే గృహ నిర్మాణంలోనూ ఇటీవల కాలంలో ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. ఇళ్ల నిర్మాణం విషయంలో కూడ టార్గెట్‌ను రీచ్‌ కాలేకపోతుందని.. కేవలం పది శాతం ఇళ్లను మాత్రమే కట్టారని ప్రతిపక్షాలు ఆరోపణలతో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన నిధులను కేటాయించకుంటే.. ఎన్నికల నాటికి ఇళ్ల నిర్మాణం హామీని అమలు చేయలేకపోయామనే విమర్శలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రమాదం లేకపోలేదు.  గృహ నిర్మాణ శాఖకు భారీగానే నిధులు కేటాయించాల్సి ఉంది. ఇదే తరహాలో ఇరిగేషన్‌కు కూడా నిధుల ఎక్కువే కావాల్సి ఉంటుంది.ఒ వైపు సంక్షేమానికి.. మరోవైపు అభివృద్ధికి అదిక నిధుల కేటాయింపులే చేయాల్సిందేనన్న విషయం స్ఫష్టం అవుతుంది.


ఆదాయ ఆర్జనపైనా ప్రత్యేకంగా దృష్టి 


ఆదాయార్జన శాఖలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాల్సి ఉంటుందని అదికార వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్‌, రెవెన్యూ వంటి వాటి నుంచి మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా  ప్రణాళికలను తప్పని సరిగా రెడీ చేసుకోవాలి.అంతే కాదు  రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగానే కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలుగా లేని కేంద్ర పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్లు కేటాయించడం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం ఉండదనే అభిప్రాయం కూడ లేకపోలేదు. ఈ క్రమంలో విద్య, వైద్యం వంటి రంగాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటున్నందున ఈ రంగాలకు సంబంధించి కేంద్రం నుంచి ఎంత మేరకు నిధులను రాబట్టగలమనే అంచనాలను కూడా సిద్దం చేస్తున్నారు ఆయా శాఖలకు చెందిన అధికారులు.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అత్యంత ప్రాధాన్యంగా ఏయే అంశాలనైతే ప్రభుత్వం భావిస్తుందో.. వాటికి పెద్ద పీట వేసే దిశగా బడ్జెట్ కూర్పు ఉండబోతోంది.