NRI Hospital Godava :  గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈడీ తనిఖీలు చేయడం.. ఆ ఆస్పత్రి డైరక్టర్లు, వారికి చెందిన ఆస్పత్రుల్లోనూ సోదాలు చేయడం కలకలం  రేపుతోంది.  ఈడీ, ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా వీడిపోయి సోదాలు నిర్వహించారు. ఆస్పత్రుల్లోని రికార్డులను పరిశీలించారు. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన అధికారులు, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి పాత మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ ఇళ్లలోనూ సోదాలు చేశారు.విజయవాడలోని అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రిలో ఈడీ తనిఖీలు చేపట్టారు. ఇలా దాడులు జరగడానికి కారణం డైరక్టర్ల మధ్య ఉన్న గొడవలే కారణమని భావిస్తున్నారు.  


30 మంది ఎన్నారైలు కలిసి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ఆస్పత్రి !


తెలుగు వారైన 30 మంది ఎన్నారై వైద్యులు 2003లో గుంటూరు, విజయవాడ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ సంస్థ బాగానే సాగింది. రోగులకు తక్కువ ధరకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వైద్య విద్యలోనూ మంచి ప్రమాణాలు పాటిస్తూ పేరు తెచ్చుకుంది. అయితే ఈ ఆస్పత్రి డైరక్టర్ల మధ్య రానురాను విభేదాలు పెరిగిపోవడంతో చిక్కులు ప్రారంభమయ్యాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓ వర్గం ఆస్పత్రిని అమ్మేయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంది.కానీ మరో వర్గం అడ్డుకోవడంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. 
 
రెండేళ్లుగా ఆస్పత్రి అమ్మకం వివాదం !


ఎన్నారై ఆస్పత్రికి చెందన డైరక్టర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. రెండేళ్ల క్రితం ఆ ఆస్పత్రిని తెలుగు రాష్ట్రాల్లోనే పేరెన్నిక గన్న ఓ కాంట్రాక్ట్ సంస్థ కొనేసిందన్న ప్రచారం జరిగింది. అప్పట్లో అక్రమాల పేరుతో కొంత మంది డైరక్టర్లపై కేసులు కూడా పెట్టారు. అయితే సంస్థ యాజమాన్యంలో ఉన్న  30 మందిలో 20 మంది ఆస్పత్రి విక్రయ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో ఆగిపోయింది. అప్పటికే కొంత మంది డైరక్టర్లపై కేసులు నమోదయ్యాయి. ఎన్నారై అకాడమీ నిధుల్ని కొందరు పక్కదారి పట్టించారని, వారి వ్యక్తిగత అవసరాల కోసం వాటిని వినియోగించారన్న ఫిర్యాదుపై  మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది.  ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, కోశాధికారి డాక్టర్‌ అక్కినేని మణి, సీసీవో ఉప్పలాపు శ్రీనివాసరావు, సీఎఫ్‌వో వల్లూరిపల్లి నళినీమోహన్‌ నేరచర్యల్లో భాగస్వాములయ్యారని.. సొసైటీ నిధులను వారి వ్యక్తిగత అవసరాల కోసం దారి మళ్లించారని, తద్వారా రూ.5.28 కోట్ల మేర నష్టం వాటిల్లిదంటూ ఈ కేసు పెట్టారు. అయితే ఈ ఫిర్యాదు ఇచ్చిన డైరక్టర్ బుచ్చయ్య.. తర్వాత తాను తప్పుడు సమాచారం వల్ల ఫిర్యాదు ఇచ్చానని.. ఎలాంటి అక్రమాలు జరగలేదని ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. కానీ పోలీసులు మాత్రం కోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. 
 
ఆ నలుగురిపైనా ప్రస్తుతం ఈడీ, ఐటీ దాడులు !


పోలీసులు కేసులు నమోదు చేసిన ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, డాక్టర్‌ మణి అక్కినేని, ఛీప్‌ కో ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ ఉప్పల శ్రీనివాసరావు, చీఫ్‌ పైనాన్సింగ్‌ ఆఫీసర్‌ నళిని మోహన్‌ పైనే ప్రస్తుతం ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. వీరికి ఏపీ పోలీసుల నుంచే పూర్తి సమాచారం వెళ్లినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో పోలీసులు జరిపిన సోదాల్లో  సుమారు 1500 మంది పేషెంట్ల రికార్టులను ఎన్‌ఆర్‌ఐ అకౌంటెంట్‌ విభాగం కంప్యూటర్‌లో ఎంటర్‌ చేయలేదని..  మరో వైపు ఎన్‌ఆర్‌ఐ ఎఎస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని క్రియేట్‌ చేసిన డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, డాక్టర్‌ మణి, అక్కినేని నకిలీ ఇన్వాయిస్‌లను తయారు చేసి ఎన్‌ఆర్‌ఐకి చెందాల్సిన రూ.  62 లక్షల 72 వేల172 రూపాయలను సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  కోవిడ్‌ ఇన్సోలేషన్‌ వార్డ్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌, ఇన్‌ ప్రాస్టక్చర్‌ మొబెలైజెషన్‌ కోసం మంజూరు చేసిన రెండు కోట్లు రూపాయలను, ఫేక్‌ కంపెనీ అకౌంట్‌ ద్వారా పక్కదారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్‌ కాలేజీ యాజమాన్యం కోటాలో సీట్లను అక్రమ మార్గంలో అమ్ముకొని అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.  డాక్టర్‌ మణి అక్కినేని విజయవాడలోని తన సొంత ఆసుపత్రికి ఖరీదైన పరికరాల కోసం డమ్మీ కొనుగోలు ఆర్డర్లు ద్వారా ఎన్నారై ఆసుపత్రి సొమ్మును రూ.75 లక్షలు క్లియర్‌ చేసినట్లు  ఫిర్యాదులు వెళ్లాయి.


మొత్తంగా ఈడీ, ఐటీ దాడులు ఎన్నారై అకాడమీ డైరక్టర్ల మధ్య గొడవల వల్లే జరుగుతున్నాయని.. ఆ ఆస్పత్రిని అమ్మాలని ఓ వర్గం.. వద్దని మరో వర్గం మధ్య జరుగుతున్న పోరాట ఫలితమే ఇదని అంటున్నారు.  విజయవాడలో జరిగిన సోదాలపై ఈడీ అధికారిక ప్రకటన చేస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.