Chandrababu Arrest :  చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పలు కీలక సందేహాలను లెవనెత్తారు. 


ఏ 37కు డబ్బు ముట్టినట్లుగా ఆధారాలు చూపించాలన్న న్యాయమూర్తి 


చంద్రబాబుకు  బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రిమాండ్ రిపోర్టునే ఆయన మళ్లీ చదివి వినిపించారు.  ఈ సమయంలో న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమాండ్‌కు పంపినప్పుడు..తర్వాత కస్టడీ పిటిషన్ల సమయంలోనూ ఇదే వాదనలు వినిపించారు. పదే పదే అవే వాదనలు వినిపిస్తూ సమయం ఎందుకు వృధా చేస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో ఏ 37కి డబ్బు ముట్టినట్లుగా ఆధారాలు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే  పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని అనే ఇద్దరు విదేశాలకు పారిపోయారని.. వారితో చంద్రబాబుకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్నారు. వారిద్దరూ ఐటీ నోటీసుల్లో ఉన్న వారేనా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. చంద్రబాబు జైల్లో ఉండగానే సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని బెయిల్ ఇస్తే ఇంకా ప్రభావితం చేస్తారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. అయితే జైల్లో ఉన్న వ్యక్తి సాక్షుల్ని ఎలా ప్రబావితం చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏదైనా ప్రభుత్వ స్కీంలో స్కాం జరిగిదే.. హెచ్‌వోడీని బాధ్యుడ్ని చేస్తారా.. ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేస్తారా  అని  న్యాయమూర్తి ఏఏజీని ప్రశ్నించారు. 


కేబినెట్ నిర్ణయానికి చంద్రబాబును ఎలా బాధ్యుడ్ని చేస్తారని చంద్రబాబు లాయర్ వాదన


ఉదయం  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పిదం ఏమీ లేదు అని అన్నారు. అప్పటి ఆర్థిశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి స్కిల్ డవలప్‌మెంట్‌పై అధ్యయనం చేశారు అని న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంంతరం తెలపలేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి అని కోర్టులో దూబే వాదనలు వినిపించారు. కాస్ట్ ఎవాల్యూషన్ కమిటీలో చంద్రబాబు నాయుడు లేరు అని కోర్టు దృష్టికి తెలిపారు. ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని వాదించారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించిందని వాదించారు. చంద్రబాబు నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కోర్టులో వాదించారు. అరెస్ట్ చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడును విచారించారని వాదించారు. ఇప్పటికే రెండు రోజులపాటు చంద్రబాబును సీఐడీ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టిందని...మళ్లీ కస్టడీ ఎందుకు అని దూబె వాదించారు. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై ఎలా కేసు పెడతారు అని ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు.


గురువారం ఉదయం విచారణ


ఏఏజీ వాదనలు విన్న తర్వాత విచారణను గురువారానికి వాయిాదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తి చెప్పారు. అయితే ఆలస్యమైనా ఇవాళే విచారణ పూర్తి చేయాలని చంద్రబాబు తరపు లాయర్ కోరారు. తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని.. గురువారం ఉదయం పదకొండు గంటలకు విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పి వాయిదా వేశారు. రేపు ఉదయం చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.