Chandrababu Arrest: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా శనివారం రాత్రి కాంతితో క్రాంతి కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు, మద్దతుదారులు భారీగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ఇళ్లలోని లైట్లు ఆఫ్ చేశారు. అనంతరం ఇంటి బయటకు వచ్చి దీపాలు, కొవ్వొత్తులు తెలిగించి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో టీడీపీ శ్రేణలు, అభిమానులు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి ఈ కార్యక్రమంలో స్వచ్చంధంగా పాల్గొన్నారు. ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించారు. అలాగే రోడ్లపై ఉన్నవారు వాహనాల లైట్లు బ్లింగ్ చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.


శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్.. హస్తినలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నేతలతో కలిసి కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైసీపీ స‌ర్కార్ తీరుపై నిర‌స‌న తెలిపారు. సేవ్ ఏపీ... సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్య‌క్ర‌మానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.  సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నేతలందరూ నినదించారు. అటు రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి దీపాలు వెలిగించగా.. హైదరాబాద్‌లో నారా భువనేశ్వరి కొవ్వొత్తులు వెలిగించారు. ఇక ఎన్టీఆర్ భవన్ వద్ద ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు, టీడీపీ నేతలు దీపాలు వెలిగించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్, బెంగళూరులో కూడా టీడీపీ అభిమానులు దీపాలు వెలిగించి బాబుకు మద్దతుగా నిలిచారు.


ఈ కార్యక్రమం సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నిజాయితీగా రాజకీయాలు చేసిన పున్నమి చంద్రుడు చంద్రబాబు అని, చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో వెలుగులు నింపాలని అన్నారు. అక్రమ కేసులో అరెస్ట్ చేసి చంద్రబాబును జైల్లో ఉంచారని, ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు. 29 రోజులైందని, ఏమైనా ఆధారాలు సంపాదించారా? అని ప్రశ్నించారు. కార్యకర్తల కష్టంతో నడిచే పార్టీ టీడీపీ అని, తమ పార్టీకి చట్టబద్దంగా, న్యాయబద్దంగా విరాళాలు వచ్చాయన్నారు. తమ పార్టీకి 40 ఏళ్ల చరిత్ర ఉందని, నిన్న, మొన్న వచ్చిన వైసీపీకి వందల కోట్లు ఎలా వచ్చాయని అచ్చెన్నాయడు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నించడమే చంద్రబాబు చేసిన తప్పా? అని నిలదీశారు. 


'ప్రజలకు అండగా ఉండటం చంద్రబాబు చేసిన తప్పా? రాష్ట్రంలోని ప్రకృతి వనరులను వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. చంద్రబాబు జీవితం తెల్లకాగితం.. తెరిచిన పుస్తకం.. చంద్రబాబు చేసిన అభివృద్ది గురించి 29 రోజులుగా చర్చిస్తున్నారు' అని అచ్చెన్నాయడు అన్నారు. కాగా చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్చంధంగా తమ ఇళ్లల్లోని లైట్లు 5 నిమిషాలపాటు ఆపేసి బాల్కానీ, వీధుల్లోకి వచ్చి మొబైల్ టార్చ్‌లు, టార్చ్‌లైట్లతో వెలుగులు ప్రదర్శించారు. ఈ దృశ్యాలను బాబును నేను అనే  హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా వినూత్న కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిస్తుంది. ఇటీవల మోత మోగిద్దాం అనే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.