Yuvagalam Padayatra: రాజకీయాల్లో ఓ లక్ష్మణ రేఖ ఉంటుందని.. దానిని ఎవరూ దాటకూడదని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. 68వ రోజు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభించారు లోకేశ్. యువగళం పాదయాత్ర తూట్రాలపల్లికి చేరుకోగానే నారా లోకేష్ భోజన విరామం తీసుకున్నారు. ఈ విరామ సమయంలోనే ఆయన రెడ్డి సామాజిక వర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్.. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ ప్రత్యర్థులు అయినప్పటికీ, ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించుకోలేదని లోకేశ్ తెలిపారు. ఇద్దరూ పరస్పరం గౌరవంగా మెలిగారని గుర్తు చేశారు. నేటి కాలంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. టీడీపీలో కులం, మతం, ప్రాంతం అంటూ తేడాలేమీ ఉండవని.. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడమే తమ పార్టీకి తెలిసిన విషయమని లోకేశ్ స్పష్టం చేశారు. 


'జగన్ రాష్ట్ర పరువు తీస్తున్నారు'


తాడిపత్రిలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసుని లోకేశ్ అన్నారు. ఎప్పుడైనా జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యంగా ఇతరుల ఇళ్లకు వెళ్లారా అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యంగా ఇతరుల ఇళ్లకు వెళ్లి కుర్చీలో కూర్చున్నారా అని నిలదీశారు. ప్రస్తుత తాడిపత్రి శాసన సభ్యుడు ఏం చేస్తున్నారో, ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుని లోకేశ్ అన్నారు. అందరం కలిసే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని లోకేశ్ హితవు పలికారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ రాష్ట్ర పరువు తీసిని దాఖలాలు లేవని, చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులను వైఎస్సార్ కొనసాగించారు కానీ చెడగొట్టలేదని అన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరువు పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏదైనా అభివృద్ధి జరిగిందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులపై న్యాయ పోరాటానికి సిద్ధమని నారా లోకేశ్ తేల్చి చెప్పారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సి వస్తుందని, వ్యవస్థ మాత్రమే శాశ్వతం అన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలని లోకేశ్ సూచించారు.


'జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది'


యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజవర్గంలోని పి.కొట్టాలపల్లిలో... నిరుద్యోగులు, రైతులు నారా లోకేశ్ ను కలిశారు. రైతులు, నిరుద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేశ్ కు వినతి పత్రాలు అందజేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని, సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అకాల వర్షాలకు పంటలు దెబ్బతినగా.. నేటిక నష్టపరిహారం అంచనాలు సిద్ధం చేయలేదని రైతులు నారా లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇచ్చి సీఎం జగన్ ఆ హామీని నెరవేర్చలేదని నిరుద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో ఉపాధి దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతోందని వారు లోకేశ్ కు తెలిపారు.