Chandrababu Projects Visit: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ వ్యవహరంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడి చేయాలని జిల్లాల రాయసీమ నాయకులను అలర్ట్ చేసింది. ఉమ్మడి కర్నూల్, కడప, అనంతపురం, నాలుగో రోజు చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు షెడ్యూల్ ఫిక్స్ అయింది. 


చంద్రబాబు ప్రాజెక్ట్ ల యాత్ర...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన టూర్ లో భాగంగా మొదటి రోజు (ఆగస్టు 1న)  నందికొట్కూరు లో రోడ్ షో నిర్వహించనున్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్ట్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సందర్శంచనున్నారు. మొదటి రోజు కర్నూల్, రెండో రోజు కడప, మూడో రోజు అనంతపురం, నాలుగో రోజు చిత్తూరు జిల్లాల లో చంద్రబాబు షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఇతర మిగిలిన జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల వద్దకు వెళ్ళి ఆయా ఆయకట్టు పరిధిలోని రైతులతో మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.


అధికార వైసీపీ అలర్ట్...
చంద్రబాబు ప్రాజెక్ట్ ల టూర్ పేరుతో యాత్ర చేపడుతుండటంతో రాజకీయంగా రానున్న విమర్శలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తం అయ్యారు. రాయలసీమ పరిధిలోని జిల్లాల్లోని వైసీపీ నాయకులను పార్టీ నాయకత్వం అలర్ట్ చేసింది. చంద్రబాబు చేసే రాజకీయ విమర్శలు, రైతులను అడ్డుగా పెట్టుకొని చేస్తున్న ఆరోపణల పై ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు వైసీపీ హై కమాండ్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. తప్పుడు సమాచారంతో ఇష్టానుసారంగా రైతులను అడ్డుగా పెట్టుకొని విమర్శలు చేసి, ప్రభుత్వం బురద చల్లే కార్యక్రమాలను అడ్డుకునేందుకు నిజమైన సమాచారాన్ని సిద్దం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ సీసీ రాష్ట్ర నాయకత్వం సూచనలు చేసింది.


ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం శుభవార్త...
పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శుభవార్త తెలిపింది. ప్రాజెక్ట్‌లో కేవలం సాగు నీటి విభాగం పనులకు  మాత్రమే నిధులు ఇస్తామని, తాగు నీటి విభాగం కోసం చేసే ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్లు మొండికేసిన కేంద్ర ప్రభుత్వం, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించిన 55,548 కోట్ల రూపాయల నిధుల గురించి అడిగిన ప్రశ్నకు జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు స్పందించారు. 
పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్‌ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి 10,911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మరమ్మతు పనుల నిమిత్తం అదనంగా మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిరభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు.  తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆ విభాగం ఎలాంటి అభ్యంతరం లేదని తమకు సమాచారం ఇచ్చిందని మంత్రి చెప్పారు.
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇప్పటి వరకు కాంపోనెంట్‌ వారీగా జరిగిన పనులకు కేంద్రం నిధులు చెల్లిస్తూ వస్తోంది. కాంపోనెంట్‌ వారీగా నిధుల చెల్లింపు వలన ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రాష్ట్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో ఇదే విషయాన్ని పలుమార్లు ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ, జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దృష్టికి తీసుకువచ్చి కాంపోనెంట్‌ వారీ చెల్లింపుల పై సీలింగ్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపోనెంట్‌ వారీ సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం గత జూన్‌ 5న తమకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial