తాడిపత్రి నియోజకవర్గంలో తమ ఆధిపత్యం కోసం గ్రామాలలో హత్యలు చేయించిన ఘనత జేసీ సోదరులదేనని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గం లో 4వ రోజు ప్రజా సంక్షేమ పాదయాత్ర పెద్దవడుగూరు మండలం బందార్లపల్లి, అప్పేచెర్ల, కదరగుట్టపల్లె, కిష్టిపాడు గ్రామాలలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పాదయాత్ర చేశారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపి హిందూపురానికిచెందిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. 


అప్పేచెర్ల గ్రామంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద వడుగురు మండలం క్రిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు అప్పేచెర్ల విజయ భాస్కర్ రెడ్డిని హత్య చేయించింది జేసీ సోదరులే అని ఆరోపించారు. గ్రామాలలో జెసి సోదరులు తమ ఆధిపత్యం కోసం హత్యలు చేయించింది వాస్తవం కాదా ప్రశ్నించారు. తాడిపత్రి పోలీసులను జెసి ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తుందని, పోలీసు అధికారుల సంఘం జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 


తాడిపత్రిలో పోలీసులు చక్కగా విధులు నిర్వహిస్తూ ఉంటే ఉన్నతాధికారులు ప్రతిరోజు ఎందుకు వేధిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి పతనం జెసి సొంత మండలం పెద్దపప్పూరు మండలం నుంచి మొదలైందన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. తాడిపత్రి నియోజకవర్గంలోని ఏ మండలంలోనైనా జెసి ప్రభాకర్ రెడ్డికి మెజార్టీ వస్తే ఆయనకు జీవితాంతం దాసోహం చేస్తానని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తాడిపత్రి లో దాడికి గురైన ఐ టీడీపీ గండికోట కార్తీక్ ఎవరో కూడా తనకు తెలియదని, అతనిపై దాడి చేయాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పైన గెలిస్తేనే నేను గెలిచినట్లు అని ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తేనే మజా ఉంటుందని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు.


జేసీ అనుచరుడిపై దాడి 
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గండికోట కార్తీక్‌పై హత్యాయత్నం చేశారు కొందరు దుండగులు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొంతమంది యువకులు ఆయనపై దాడి చేశారు.  దీంతో కార్తీక్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. తాను వెళ్తున్న మార్గంలో కాపు కాసి కత్తులు, కర్రలతో దాడి చేశారని బాధితుడు కార్తీక్ తెలిపారు. తాడిపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే నెపంతో వైసీపీకి చెందిన వాల్లే ఈ దాడికి పాల్పడ్డారని కార్తీక్ ఆరోపించారు. 


"మేము పోలీసులకు ఫిర్యాదు చెయ్యం, ఈ దాడిపై సుమోటో కేసుగా కట్టుకొని విచారణ చేయాలి. పోలీసులతో న్యాయం జరగదు. కంప్లైంట్ ఇవ్వడానికి పేపరు పెన్ను వేస్ట్. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పంచి ఇప్పించి కొడతాం. పోలీసులు ఉన్నారని ఉరుకున్నాం. మేము కేసులు పెడితే మడిచి వెనుక పెట్టుకుంటున్నారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయింది. లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసులు టీడీపీ వాళ్లపై పెట్టిన కేసులు మడిచి జేబులో పెట్టుకుంటాం. మేం ఎవరికీ తలవంచం. వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెట్టరు. టీడీపీ వాళ్లు ఏమైనా మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు. ప్రజలు మాతోనే ఉన్నారు. డీఎస్పీ చైతన్య తీరు అభ్యంతకరం."- జేసీ ప్రభాకర్ రెడ్డి