YS Sharmila Comments : రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలకు సిద్ధమని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి (Sharmila Reddy)స్పష్టం చేశారు. ఎన్ని దాడులు చేసినా భరిస్తానని, తన కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదన్నారు. హంద్రీనీవాకు సంబంధించి వైఎస్సార్ 90 శాతం పనులు చేస్తే, జగనన్న 10 శాతం చేయలేకపోయాడు అని షర్మిల విమర్శించారు. అనంతపురం (Anantapuram) జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి (Congress Party Meeting)సమావేశం జరిగింది. మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి(Raghuveera Reddy), శైలజా నాథ్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిలా రెడ్డి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి వైఎస్సార్ బిడ్డ అడుగు పెట్టిందన్నారు. బీజేపీకి బానిసలుగా మారిన  జగన్ కి ,బాబు కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించిన షర్మిలా రెడ్డి, ఆంధ్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టినందుకు ఓటు వేయాలా ? అని నిలదీశారు. ఆంధ్ర ప్రజల కోసం కొట్లాడుతుంటే తనపై దాడులు చేస్తున్నారని...తనపై ఎన్ని దాడులు చేసినా భరిస్తానన్నారు. 


అనంతపురం జిల్లా అంటే వైఎస్సార్ కి ప్రియమైన జిల్లా అన్న షర్మిలా రెడ్డి...దేశంలోనే అత్యల్ప వర్షపాతంలో జిల్లా రెండో స్థానం ఉందన్నారు. ఈ ప్రజలను బతించుకోవాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమ్మారని...ఇక్కడి ప్రజలకు మంచినీళ్ళ కోసం రఘువీరా రెడ్డి తాత పేరు మీద మంచినీటి పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం ఈ జిల్లా నుంచే ప్రారంభించారని, వైఎస్సార్ హయాంలో  22 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగయ్యేదన్నారు షర్మిలారెడ్డి. వేరుశెనగ పంట పండక పోతే డబ్బులు పండిస్తామన్నారని...వైఎస్సార్ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేదన్నారు. దీంతో రైతులకు భరోసా ఉండేందని...ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో కూడా పంట వేయడం లేదన్నారు. బీమా లేకపోవడంతో రైతులు సాహసం చేయడం లేదన్న షర్మిలారెడ్డి...దీనికి కారణం జగన్ ఆన్న ప్రభుత్వమేనని విమర్శించారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయంపై సబ్సిడీ ఉండేదని...అన్ని రకాల పరికరాలు సబ్సిడీపై వచ్చేవని, ఇప్పుడు సబ్సిడీ అనే పథకమే లేదన్నారు. సబ్సిడీలు ఎత్తివేసిన జగన్ ఆన్న ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. 


వైఎస్సార్ వెళ్ళిపోయాక రఘువీరా రెడ్డి...రైతుల కోసం చాలా తాపత్రయ పడ్డారన్న షర్మిలారెడ్డి...ఇక్కడ రైతులకు మేలు చేసేందుకు కేంద్రానికి లేఖ రాశారని షర్మిలా రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్ట్ అనంత సృష్టికర్త రఘువీరా రెడ్డి అన్న షర్మిలా...8 వేల కోట్ల రూపాయలు విడుదల చేయించారని అన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అన్ని ఇక్కడికి వచ్చేవని...కాంగ్రెస్ ఓడిపోవడంతో అంతా వృధా అయ్యిందన్నారు. గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ అధికారంలో ఉండి ప్రాజెక్ట్ అనంత గురించి పట్టించుకోలేదని షర్మిలా రెడ్డి విమర్శించారు. బీజేపీకి బానిసలుగా మారి.. అనంత ప్రాజెక్టుకు తూట్లు పోడించారని...హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే...6.50 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే... నాలుగు జిల్లాలకు సాగునీరు అందేదన్నారు. హంద్రీనీవా పనులు 90 శాతం వైఎస్సార్ పూర్తి చేశారన్న షర్మిలారెడ్డి... 10 శాతం పనులు జగన్ అన్న పూర్తి చేయలేక పోయాడని విమర్శించారు. హంద్రీనీవా కోసం జల దీక్ష కూడా చేశారన్న షర్మిలారెడ్డి...6 నెలల్లో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చారని అన్నారు. 


ఆంధ్రప్రదేశ్ తన పుట్టినిల్లు అని, ఇక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ప్రజల హక్కులు హరిస్తున్నారని షర్మిలారెడ్డి మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలు బీజేపీకి బానిసలుగా మారి, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ ఆన్న ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని, జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారని...5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ రాలేదన్నారు. కనీసం ఒక డీఎస్సీ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు.