YSRCP Vs Congress: YCP నేత బొత్స సత్యనారాయణపై ఎక్స్ వేదికగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ళు ఖాళీగా ఉన్నది ఎవరో, రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్నది ఎవరో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ గారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుందిని..  నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో..  పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో  రాష్ట్ర  ప్రజానీకానికి తెలుసన్నారు. 


5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారు.  అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారు.  పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని మండిపడ్డారు.  ప్రజల సంపదను ప్యాలెస్ కి మళ్లించుకున్నారు.  5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారన్నారు.  పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని.. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు.  చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారన్నారు. 


మిర్చి రైతుల కష్టాలపై మీకంటే ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.  రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా రూ.5వేల కోట్లతో ..  ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.  కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగింది కాంగ్రెస్ పార్టీ.  సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సహాయం రూ.20 వేలు వెంటనే అందించాలని కోరింది కాంగ్రెస్ పార్టీ.   ప్రతి నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అన్నారు. 



అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం మీకుంది కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్ళాలని డిమాండ్ చేశామన్నారు.  రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని అడిగామని..  చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే,  వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలని కోరితే.. ప్రజల పక్షాన నిలబడాలని అడిగితే..  వ్యక్తిగత అజెండా అంటూ వైసీపీ నేతలు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదమన్నారు.  సమాధానం చెప్పలేక దాటవేయడం మీ అవివేకానికి నిదర్శనమని..  మళ్ళీ మళ్ళీ వైసీపీనీ అడుగుతున్నాం.  అసెంబ్లీకి వెళ్ళే అంశంపై మీ పాలసీ ఏంటో చెప్పాలన్నారు.  అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించాలని..  ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మీకు ఓట్లు వేసిందన్నారు. దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.