AP Cag Report :   ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై  ఆడిట్‌ నివేదికను కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్ (కాగ్‌) సమర్పించింది. 2022 మార్చి 31 తేదీతో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్‌ కార్యాలయం అందజేసింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.3,72,503 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఇందులో 90 శాతం మేర రుణాలు.. 13.99 శాతం వడ్డీ తో  తీసుకున్నారని తెలిపింది.  2018 నుంచి 2022 వరకూ అంతర్గత రుణాలు 77.54 శాతం మేర పెరిగాయి. గడిచిన 5 ఏళ్లలో తలసరి రుణం 61 శాతం మేర పెరిగింది, బడ్జేటేతర రుణాలు కూడా కలిపితే తలసరి రుణ భారం 92,797గా నమోదైంది. వచ్చే ఏడేళ్లలోగా రాష్ట్ర ప్రభుత్వం 1,29,817 కోట్ల రుణాల్ని తీర్చాలని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.                                     
 
కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం వలన కేంద్ర పథకాల ద్వారా వచ్చిన రూ.6,356 కోట్ల గ్రాంట్ మురిగిపోయిందని తెలిపింది.  గత ఏడాదితో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు రూ.24,257 కోట్ల మేర పెరిగాయని పేర్కొంది. మొత్తం   బడ్జెటేతర రుణాలు రూ.1,18,394 కోట్లు నమోదయ్యాయి. డిస్కమ్‌లు, నీటిపారుదల ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.17,804 కోట్లు ఉన్నాయి. వీటినీ బడ్జెట్‌లో చూపకపోవడంతో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన నిధులపై శాసనసభ నియంత్రణ కోల్పోయేందుకు కారణమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 18.47 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేసిందని కాగ్ తెలిపింది.                                


 రూ.688 కోట్ల రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయమని తప్పుగా వర్గీకరించారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ గృహవసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపింది. లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాలు, ఇళ్లను రెవెన్యూ వ్యయంగా చూపాల్సి ఉందని కాగ్ తెలిపింది.  బడ్జెట్‌లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయి. స్మార్ట్ పట్టణాలు, కృషి వికాస్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్ లాంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల కాకపోవటం వల్ల అవి సరిగా అమలు కాలేదు. రూ.3540 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా రాష్ట్రం వివిధ పథకాలకు తన వాటా విడుదల చేయలేదని తెలిపింది.                  
    
ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులను అకౌంట్లల్లో చూపలేదని, ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులను ఖాతాల్లో చూపించకపోవడం నేరమని కాగ్ పేర్కొందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు.  అవి ఏ ఖాతాల్లోకి పోతున్నాయో క్లారిటీ లేదని, నిధులను దారి మళ్లిస్తున్నారని తాము గతంలో చెబితే విమర్శించారని.. ఇప్పుడు కాగ్ అదే విషయం చెప్పిందని.. ఏపీలో ఆర్థిక విస్పోటం.. ఇదే విషయం కాగ్ చెప్పిందని పయ్యావుల వ్యాఖ్యానించారు. ఎఫ్ఆర్బీఎంను ఉల్లంఘించిందని, ప్రభుత్వ సంస్థల రుణాలను కూడా చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వ ఖాతాల్లో చూపాల్సిందేనని, ప్రభుత్వ గ్యారంటీలను.. అప్పులను దాచారని కాగ్ తన నివేదికలో పేర్కొందని పయ్యావుల కేశవ్ అన్నారు.