Revanth Reddy is getting ready for election campaign in AP :  ఏపీలో అసెంబ్లీ , లోక్‌సభకు ఒకే సారి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువగా కష్టపడుతోంది. షర్మిల పార్టీలోకి రావడంతోనే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు. అదే సమయంలో తెలంగాణలో అధికారంలోకి రావడంతో.. కాంగ్రెస్ కు మరింత సపోర్ట్ లభిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అండదండలు అందిస్తారన్న నమ్మకంతో  ఏపీ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఆయనతో భారీ బహిరంగసభలకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. 


ఏపీలో రేవంత్ ప్రచారానికి కాంగ్రెస్ ఏర్పాట్లు                           


 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని తానై వ్యవహరించి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించి.. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. ఏపీలోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది.   తాజాగా ఏపీ పాలిటిక్స్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.   ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనన్నట్లు తెలిసింది. ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నెల 25న తిరుపతిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  


విశాఖలోనూ బహిరంగసభకు ప్లాన్ 


తిరుపతితో పాటు రానున్న రోజుల్లో విసాఖ,  ఉభయ కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూల్, గుంటూరు జిల్లాలలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయిన్ లో రేవంత్ పాల్గొననున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి నడవాలని ఫిక్స్ అయింది. రేవంత్ ఏపీ పాలిటిక్స్‌లో ప్రచారం చేయనుండటం ఖరారు కావడంతో ఈ అంశంపై ప్రత్యర్థి పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఆసక్తిగా మారింది.   ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇటీవల ప్రకకటించారు.  .ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని, ఆయనతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా వస్తారని స్పష్టంచేశారు. అయితే మొదటగా తిరుపతిలో సభ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


ఏఐసీసీ అగ్రనేతల ప్రచారం 


ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకా గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాలనే అవకాశాలు ఉన్నాయి.  ఏపీకి ప్రత్యేక హోదాకు అగ్రనేత రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది.  తమ అజెండా చాలా క్లియర్‌గా ఉందని  సీఎం జగన్ ఏపీ ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తోంది.   రేవంత్ రెడ్డికి ఏపీలోనూ ఆదరణ ఉంది. ఆయన బహిరంగసభకు వస్తారంటే.. జనం పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పేరును ఉపయోగిచుకుని.. రెడ్డి వర్గాన్ని , దళిత, మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని గట్టి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. తిరుపతి సభ కు మంచి ఆదరణ లభిస్తే.. తర్వాత రేవంత్ రెడ్డి తో వరుస సభలు నిర్వహించే ఆలోచనలో ఏపీ పీసీసీ వర్గాలున్నాయి.