Rajamahendravaram Milk Adulteration: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. యూరియా కలపలేదు, మరణాలకు కారణం ఇదేనా!
Anhdra Pradesh News | పాలలో యూరియా ఆనవాళ్లు ఉన్నాయని తమ దృష్టికి రాలేదని, యూరియా కలిస్తే కిడ్నీ ఫెయిల్యూర్, కాలేయం దెబ్బతింటాయని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ పేర్కొన్నారు.

Rajamahendravaram Adulterated Milk | రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల కలకలంపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. పాలను చల్లబరిచే మేషిన్లో కూలెంట్గా వాడే ఇథలిన్ గ్లైకాల్ లీక్ అయి పాలలో కలవడమే మరణాలకు దారితీసిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పాలలో యూరియా కలిస్తే కిడ్నీ సమస్య రావడానికి, లివర్ దెబ్బతినడానికి కొంత కాలం పడుతుందని అధికారులు తెలిపారు. మంగళగిరిలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్, ఐపీఎం డైరెక్టర్ నీలకంఠారెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. కల్తీ పాలు తాగిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మరణించగా, ప్రస్తుతం 15 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఐదు నెలల చిన్నారితో పాటు ఇద్దరు చిన్నారులు కూడా చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు.
ఘటనకు కారణాలపై ఆరా.. చెన్నై, ముంబై నుంచి మెడిసిన్
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, పాలను చల్లబరిచే యంత్రంలో కూలెంట్గా వాడే ఇథలిన్ గ్లైకాల్ లీక్ అయి పాలలో కలవడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పాలలో యూరియా కలిసినట్లు వస్తున్న వార్తలను కమిషనర్ కొట్టిపారేశారు. ఒకవేళ యూరియా కలిస్తే కిడ్నీ సమస్యలు రావడానికి చాలా కాలం పడుతుందని, కానీ ఇథలిన్ గ్లైకాల్ ప్రభావం 3-4 రోజుల్లోనే తీవ్రంగా ఉంటుందని వివరించారు. బాధితుల చికిత్స కోసం చెన్నై, ముంబైల నుండి ప్రత్యేక మందులను తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
నమూనాల సేకరణ
బాధితుల ఇళ్ల నుంచి పెరుగు, నెయ్యి, వెనిగర్ వంటి 10 రకాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్, కాకినాడ ల్యాబ్లకు పంపారు. వీటి ఫలితాలు బుధవారం నుండి శనివారం మధ్య దశలవారీగా రానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా కల్తీకి సంబంధించి పూర్తి స్పష్టత రానుంది. ఇప్పటికే 110 కుటుంబాలకు చెందిన 315 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉన్న ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
పాల విక్రయ, నిల్వ కేంద్రాల్లో తనిఖీలు
ముందస్తు జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లో డాక్టర్లను అందుబాటులో ఉంచారు. మరో నెల రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై పోలీసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయ, నిల్వ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించి, లైసెన్సులు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఐపీఎం డైరెక్టర్ నీలకంఠారెడ్డి హెచ్చరించారు.
మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ
కల్తీ పాలు తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇదివరకే పరిహారాన్ని ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి నేతృత్వంలో వారికి చెక్కులు అందజేశారు. చౌడేశ్వరీనగర్కు చెందిన శేషగిరిరావు, గాంధీపురానికి చెందిన తాడి రమణి, తాడి కృష్ణవేణి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించారు. రాజానగరానికి చెందిన రాధాకృష్ణమూర్తి కుటుంబానికి ఎమ్మెల్యే బలరామకృష్ణ, ఆర్డీవో కృష్ణనాయక్లు పది లక్షల పరిహారం చెక్కు అందజేశారు.























