ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా సీఎం జగన్ అరెస్ట్ చేయించారని, ఇప్పుడు నారా లోకేష్ ను సైతం సంబంధం లేని కేసులలో ఇరికిస్తున్నారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. త్వరలోనే జైలు భరో కార్యక్రమం చేస్తామని అరెస్టులకు టీడీపీ నేతలు భయపడరు అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడిస్తే తప్పా, ఏపీ బాగుపడదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ పెట్టడంతో అక్కడ స్కిల్స్ నేర్చుకుని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. 


సెక్షన్ 30, సెక్షన్ 144 పెట్టి ప్రజలను రోడ్లపైకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది ఏపీ సర్కార్ అన్నారు. పోలీసులు అడ్డుకున్నా టీడీపీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా నిరసన తెలిపుతున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను తాము అరెస్ట్ చేయలేదని, ఆయనను తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేశామన్నారు. న్యాయం తమవైపు ఉందని, లోకేష్ ను జైల్లో వేయాలని నోటీసులు ఇచ్చారు. ఏ తప్పు చేయలేదు కనుక తమ అధినేత చంద్రబాబు జైలు నుంచి విడుదల అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి వైసీపీకి మోత మోగిస్తామన్నారు.






జగన్ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం, 14 కేసులు ఉన్న జగన్ బయట తిరుగుతూ సీఎంగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ బయట తిరుగుతుంటే వారికి మద్దతు పెరిగిపోతుందని అక్రమ కేసులు బనాయించి టీడీపీ అగ్రనేతల అరెస్టులకు జగన్ సర్కార్ ప్లాన్ చేసిందని ఆరోపించారు. తమ అధినేత చంద్రబాబు జైలులో ఉన్నారని, తాము సైతం న్యాయం కోసం పోరాటం చేస్తూ జైళ్లకు వెళతామన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, న్యాయాన్ని గెలిపించుకునేందుకు టీడీపీ నేతలందరం జైలు భరోకు శ్రీకారం చుడతామన్నారు.



న్యాయం గెలవాలని, చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని నారా బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఈ నిరసనలో పాల్గొన్నారు. లోకేష్ ఢిల్లీ నుంచి మోత మోగిద్దాంలో పాల్గొని చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించారు. చంద్రబాబుకు మద్దతుగా ఉండేవారు ఎక్కడిక్కడ తమకు అనుకూలమైన  పద్దతిలో నిరసనలు చేపట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల శబ్దాలతో రాష్ట్రం కొన్ని నిమిషాల పాటు మార్మోగిపోయింది.


నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదని, అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అంటూ టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబుకి మద్దతుగా... నేటి (సెప్టెంబర్ 30) రాత్రి 7 గంటల నుండి కొన్ని నిమిషాల పాటు సీఎం జగన్ కు వినిపిచేయాలా చేయాలని ఏదో విధంగా మోత మోగించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.