Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Jnaneswari Missing Case Tuni:కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు వినూత్న ఆపరేషన్ టాయ్ చేపట్టారు. అడవి జంతువుల అనుమానంతో బొమ్మలు, కెమెరాలతో వేట సాగిస్తున్నారు.

- తునిలో జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు మార్చారు.
- 'ఆపరేషన్ టాయ్' తో జంతువుల పాత్ర నిర్ధారించేందుకు ప్రయత్నం.
- మాంసం నింపిన బొమ్మలు అమర్చి కెమెరాలతో నిఘా పెట్టారు.
- కొండప్రాంతంలో అడవి జంతువుల సంచారంపై దృష్టి సారించారు.
Gnaneswari Missing Case Tuni:కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామం ప్రస్తుతం ఒక తెలియని ఆందోళనలో ఉంది. రెండేళ్ల పసిపాప జ్ఞానేశ్వరి ఆదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్నారి అదృశ్యమై రోజులు గడుస్తున్నా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులు ఇప్పుడు రూట్ మార్చారు. సంప్రదాయపద్ధతులతోపాటు శాస్త్రీయ, వినూత్న పద్ధతులను అమలు చేస్తున్నారు. గ్రామ శివారులో కొండ ప్రాంతం, అటవీ సరిహద్దుల వద్ద ఈ దర్యాప్తును కేంద్రీకృతం చేశారు. ఇక్కడ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ టాయ్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఏంటీ ఈ ఆపరేషన్
సాధారణంగా నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు డెకాయ్ ఆపరేషన్లు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్నారిని గుర్తించడానికి లేదా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఆపరేషన్ టాయ్ చేపట్టారు. చిన్నారి జ్ఞానేశ్వరి శరీర ఆకృతిని పోలి ఉండే రెండు బొమ్మలను పోలీసులు ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ బొమ్మలను పాప అదృశ్యమైనట్టు భావిస్తున్న ప్రదేశంలో ఉంచారు. అడవి జంతువులను ఆకర్షించేలా ఆ బొమ్మలలో కొంత మాంసాహారాన్ని కూడా అమర్చారు. ఇది వినడానికి వింతగా ఉన్నా, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ప్రక్రియ.
ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
సీహెచ్ అగ్రహారం గ్రామం కొండ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. అక్కడ అడవి జంతువులు, ముఖ్యంగా కొండచిలువలు, ఇతర క్రూర మృగాల సంచారం ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పాపపై ఏదైనా జంతువు దాడి చేసి ఉంటే, అదే జంతువు మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. మాంసం వాసన ఆ జంతువుల త్వరగా ఆకర్షిస్తుంది. జంతువుల ద్వారా ప్రమాదం జరిగిందా లేదా అన్న సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి పోలీసులకు ఇది ఒక కీలకమైన మార్గంగా కనిపిస్తోంది.
నిఘా ఎలా చేస్తారు?
బొమ్మలను అమర్చిన ప్రాంతంలో పోలీసులు అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు రాత్రి పూట కూడా స్పష్టమైన చిత్రాలను తీయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒకవేళ అడవి జంతువులు ఆ బొమ్మల వద్దకు వస్తే, వెంటనే కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. దీని వల్ల పాప అదృశ్యం వెనుక జంతువుల హస్తం ఉందా అనేది స్పష్టమవుతుంది. అటవీ సరిహద్దు కంచె వద్ద ప్రతి అంగుళాన్ని పోలీసులు గాలిస్తున్నారు. గ్రామస్థుల సహకారంతో కొండ ప్రాంతాల్లోని గుహలను, పొదలను కూడా జల్లెడ పడుతున్నారు.
జ్ఞానేశ్వరి తన ఇంటి వద్ద ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడం కేసును మరింత క్లిష్టంగా మారింది. గ్రామస్థులు మొదట కిడ్నాప్ కోణంలో ఆలోచించినా, భౌగోళిక పరిస్థితులను బట్టి పోలీసులు అటవీ కోణాన్ని విస్మరించడం లేదు. ప్రస్తుతానికి ఈ టాయ్ ఆపరేషన్ వద్ద ఎలాంటి జంతువుల కదలికలు సమోదయ్యాయనేది పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే ఈ కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉంది.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజల తమ పిల్లల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయటకు పంపకూడదు. వన్యప్రాణుల కదలికలు ఉన్నప్పుడు స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల ఇలాంటి అవాంఛనీయ ఘటనలను నివారించవచ్చు. వినూత్న దర్యాప్తు ఫలితాలు ఎలా ఉంటాయోనని జిల్లా ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















