Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Rayavaram Deputy Tahsildar Love Marriage | రాయవరం డిప్యూటీ తహసీల్దార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యాపారిని వధువు సోదరులు అత్యంత దారుణంగా హత్య చేశారు.

Honour Killing in Konaseema | మండపేట: ఏపీలో మరో పరువు హత్య కలకలం రేపింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో, ఒక వ్యక్తిని అతని భార్య సోదరులే దారుణంగా హత్య చేశారు. మండపేట మండలం ద్వారపూడి శివారు ప్రాంతమైన వేములపల్లిలో గురువారం రాత్రి ఈ ఘోరం జరిగింది. కులాంతర వివాహం చేసుకోవడమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. వేములపల్లికి చెందిన పీవీవీ సూర్యప్రకాశరావు (41) స్థానికంగా వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య ప్రస్తుతం రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ క్లాస్మేట్స్ కావడంతో గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో సంధ్య కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో వారు గురువారం ఉదయం అన్నవరంలో వివాహం చేసుకుని, అనంతరం వేములపల్లిలోని సూర్యప్రకాశ్ ఇంటికి చేరుకున్నారు.
పెళ్లి విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు చంద్రపాల్, గిరిబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎలాగైనా సరే బావ సూర్యప్రకాశ్ ను చంపాలని ప్లాన్ చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి సూర్యప్రకాశ్ ఇంటికి వెళ్లిన భార్య సోదరులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరూ కలిసి బండరాయితో ఆయన ముఖంపై బలంగా బాదడంతో తీవ్ర రక్రస్త్రావమై సూర్యప్రకాశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు నిందితులు చంద్రపాల్, గిరిబాబులను పట్టుకుని చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు. మండపేట సీఐ, ఎస్సై ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు చంద్రపాల్, గిరిబాబులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
























