Tadapatla Ratnabai Death News: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రత్నాబాయి కన్నుమూత
Ratnabai Passes Away | మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు తడపట్ల రత్నాబాయి ఆదివారం రాత్రి కన్నుమూశారు. రంపచోడవరం ప్రాంతంలో విషాదం అలుముకుంది.

Tadapatla Ratnabai | రంపచోడవరం: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ (రాజ్యసభ సభ్యురాలు) తడపట్ల రత్నాబాయి (79) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, రంపచోడవరంలోని తన నివాసంలో ఆరోగ్యం క్షీణించడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రత్నాబాయి మరణంతో రంపచోడవరం ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రత్నాబాయి రాజకీయ ప్రస్థానం ఎంతో సుదీర్ఘమైనది. ఆమె 1972లో ఎల్లవరం (ప్రస్తుత రంపచోడవరం) నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2007లో గిరిజన సహకార సంస్థ (GCC) ఛైర్మన్గా సేవలందించారు. 2009లో ఆమెను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపింది. ఆ తరువాత 2014లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కూడా నియమితులయ్యారు. ఆమె భర్త సత్యనారాయణ కూడా పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆమె చేసిన కృషిని పలువురు నేతలు ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.























