Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Man vs Wild | పోలవరం జిల్లాలో పులి కదలికలను సమీప గ్రామాలకు దూరంగా, నేలకోట-పూడిపల్లి సమీపంలోని కొండ ప్రాంతానికే విజయవంతంగా పరిమితం చేశారు.

Tiger Hunt in Polavaram | అమరావతి: పోలవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలోని 'హనుమాన్' (H.A.N.U.M.A.N) ప్రత్యేక రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించి రాత్రంతా పహారా కాశాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాల నిఘా, క్షేత్రస్థాయి సిబ్బంది, వన్యప్రాణి నిపుణులు, ప్రత్యేక పశువైద్య బృందాలు పూర్తి సమన్వయంతో రంగంలోకి దిగాయి. పులి జనవాసాల్లోకి రాకుండా, దాని కదలికలను కేవలం నేలకోట– పూడిపల్లి సమీపంలోని కొండ ప్రాంతానికే పరిమితం చేయడంలో ఈ బృందాలు విజయవంతమయ్యాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ వేగంగా సాగుతోంది. ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా పూర్తి భద్రతను కల్పించడంతో పాటు, పులిని కూడా సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో పులి సంచార ప్రాంతాల ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. అలాగే అటవీ శాఖ జారీ చేసే హెచ్చరికలను, సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Through the night, H.A.N.U.M.A.N Special Teams stood vigilant.
— HANUMAN (@HANUMAN_APGOV) June 7, 2026
With drone surveillance, ground teams, wildlife experts, and veterinary specialists working in close coordination, the tiger’s movement has been successfully restricted to the hill terrain near Nelakota–Pudipalli,… pic.twitter.com/ttCg1RNqTu
ప్రజలను భయపెట్టిన పెద్దపులి
పోలవరం జిల్లా పరిధిలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు శనివారం రాత్రంతా ప్రత్యేక ఆపరేషన్ను కొనసాగించారు. ప్రస్తుతం దేవీపట్నం మండలం నేలకోట- పూడిపల్లి సొరంగం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు డ్రోన్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఆ పెద్దపులి జనవాసాలు, గ్రామాల వైపు రాకుండా అటవీ శాఖతో పాటు హనుమాన్ రెస్క్యూ బృందాలు గట్టి నిఘా ఏర్పాటు చేశాయి.
Also Read: Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఈ ఆపరేషన్ కోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వన్యప్రాణి నిపుణుల బృందం రంగంలోకి దిగింది. పులి కదలికలను నిరంతరం గమనిస్తూ, దాన్ని సురక్షితంగా పట్టుకోవడానికి ఈ బృందం సాంకేతిక సలహాలను అందిస్తోంది. పులి సంచార ప్రాంతాల్లోని గ్రామాల్లో అధికారులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైకుల) ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా బయట సంచరించవద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తిరుమలలో ఎలుగుబంటి కలకలం
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమదారిలో శనివారం ఒక ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉండే వినాయక ఆలయం సమీపంలో ఈ ఎలుగుబంటిని భక్తులు గుర్తించారు. ఆహారం, తినుబండారాల కోసం అక్కడ ఉన్న చెత్తకుండీల వద్ద అది వెతుకుతుండటం చూసి తిరుమల యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై సమాచారం అందుకున్న అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు చాకచక్యంగా వ్యవహరించి, ఆ ఎలుగుబంటిని తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























