గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఏరియల్ సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సీఎం సమీక్ష జ‌రిపి, వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న సహాయ చర్యలపై సీఎం సమగ్ర సమీక్షచేపట్టారు.


ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటుచేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, వైద్యం సహా అత్యవసర సేవలు, మందులు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు సీఎం జగన్. ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన సీనియర్‌ అధికారులతోనూ సమావేశమైన సీఎం... ఒక్కో జిల్లాకు ఒక్కో అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 


వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోసం కోరినా యుద్ధ ప్రాతిపదికిన రియాక్ట్ అవ్వాలన్నారు. సీఎస్‌ సహా అన్ని విభాగాల కార్యదర్శులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంఓ కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారన్నారు సీఎం.


ఐదు జిల్లాలకు ప్రత్యేక సీనియర్‌ అధికారులు...


ఐదు జిల్లాలకు ప్రత్యేక సీనియర్‌ అధికారులను నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు మురళీధర్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రవీణ్‌కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌ను నియమించారు.


గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రేపు కూడా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దని వారించారు సీఎం. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలన్నారు. వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయాలని తెలిపారు. గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై కూడా ఫోకస్‌ పెట్టాలని వివరించారు.


అందుబాటులో నిత్యావసరాలు...


గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... ఇసుక బస్తాలు తదితర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు జగన్. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు సీఎం. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించలని ఆదేశించారు. 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలన్నారు. 


వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమన్నారు. సెల్‌ టవర్లకు డీజిల్‌ సరఫరాచేసి అవి నిరంతరం పనిచేసేలా చూడమన్నారు.


సహాయ శిబిరాల్లో ఉండే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల రూపాయలు సాయం అందించాలన్నారు సీఎం జగన్. రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని... వీటని అత్యవసరానికి, పరిస్థితిని సమీక్షించేందుకు వినియోగించుకోమని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యరాకుండా, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్యకేంద్రాల్లో ఉంచాలన్నారు.