Konaseema Latest News: డీజే సౌండ్‌ బాక్సులు ఓ యువకుని ఉసురు తీశాయి. ఇటీవల కాలంలో డీజే బాక్సుల మితిమీరిన సౌండ్‌ ఎఫెక్ట్‌కు కొందరు మృత్యువాత పడుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. అయినా సరే ఎవ్వరూ తగ్గడం లేదు. ఉత్సవాలకు, ఊరేగింపులకు సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో కూడిన డీజేలు పెడుతున్నారు. తాజాగా అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌ బాక్సుల ధాటికి ఓ యువకుడి గుండె ఆగింది. 

అంబేడ్కర్‌ జయంతి ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే బాక్సుల ముందు డ్యాన్సులు చేసిన ఆ యువకుడు ఉదయం లేచి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గూడాల గ్రామంలో చోటుచేసుకుంది. గూడాల గ్రామం సాకావారిపేటకు చెందిన జల్లి రాజేష్‌(25) అనే యువకుడు కార్డియాక్‌ అరెస్ట్‌తో మృత్యువాత పడ్డాడు. అయితే రాజేష్‌ ఆకస్మిక మరణానికి డీజే బాక్సులే కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు స్థానికులు చెబుతున్నారు. 

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా స్థానిక యువకులు ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఈ ఊరేగింపులో డీజే సౌండ్‌ బాక్సులు కూడా పెట్టారు. దీంతో ఈ ఊరేగింపు ర్యాలీలో డీజే బాక్సుల ముందు రాజేష్‌తోపాటు స్థానిక యువకులు చాలా మంది ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. ఈ ర్యాలీ మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు గ్రామంలో సాగింది. కార్యక్రమం ముగిశాక ఇంటికి వచ్చి పడుకున్న రాజేష్‌ ఉదయం లేచి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబికులు హుటాహుటీన పేరూరు వై.జంక్షన్‌ వద్దనున్న ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న రాజేష్‌ను మెరుగైన చికిత్సకోసం అక్కడి నుంచి అమలాపురం కిమ్స్‌కు తరలించగా అప్పటికే రాజేష్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 

మృతుడు రాజేష్‌ తండ్రి వెంకటేశ్వరరావు వ్యవసాయం చేస్తుండగా, తల్లి గల్ఫ్‌ దేశంలో ఉంటుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా కుమార్తెలకు వివాహం అయ్యింది. ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఆకస్మిక మృత్యువాత పడడంతో ఆ కుటుంబికులు కన్నీరు మున్నీరవుతున్నారు. గల్ఫ్‌లో ఉంటున్న తల్లి కుమారుని ఆఖరిచూపు చూసుకునేందుకు హుటాహుటిన బయలుదేరినట్లు కుటుంబీకులు తెలిపారు.  

వరుస ఘటనలు జరుగుతున్నా...

డీజే సౌండ్‌ బాక్సుల ధాటికి వెలువడుతోన్న ధ్వనికి గుండెలు లయతప్పి ఆగుతున్నా ఎవ్వరూ భయపడడం లేదు. డీజే సౌండ్‌ ప్రకంపనలకు గతంలో గుండె ఆగిపోయి మృతి చెందిన ఘటనలు చాలానే ఉన్నాయి. కోనసీమ ప్రాంతమైన అమలాపురంలో దసరా ఉత్సవాల్లో అమలాపురం రూరల్‌ మండలం బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్‌ (21) డ్యాన్స్‌ చేస్తూ కార్డియాక్‌ అరెస్ట్‌తో మృత్యువాతపడ్డాడు. తెలంగాణాలోని వివాహం అనంతరం జరిగే వేడుకలో నూతన వరుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. 

అనంతపురం జిల్లా ధర్మవరంలో గణపతి మండపం ముందు డీజే బాక్సుల సౌండ్‌కు ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో కూడా ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. తాజాగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే అల్లవరం మండలం గూడాలలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విషాదాన్ని నింపింది. 

పరిమితికి మంచి వచ్చే సౌండ్‌తో కార్డియాక్‌ అరెస్ట్‌లు 

ఉత్సవాల ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ బాక్సులు పదుల సంఖ్యలో ఏర్పాటు చేసి ఆపై పరిమితికి మించిన సౌండ్‌ పెడుతున్నారు. దీని వల్లే ఈ తరహా కార్డియాక్‌ అరెస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. డీజే సౌండ్‌ బాక్సులకు కేవలం ఒక మీటరు దూరంలోనే డ్యాన్స్‌లు చేయడంతో స్పీకర్లు నుంచే వచ్చే ధ్వనితో ఈ ప్రభావం చెవులు, గుండెపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ డీజే సౌండ్‌ బాక్సు ముందు డ్యాన్స్‌లు చేసిన వారు రెండు రోజుల వరకు చిన్న చిన్న శబ్ధాలను వినే సామార్ధ్యాన్ని కోల్పోతారని, ఇది చాలా మందిని పరిశీలిస్తే గమనిస్తామంటున్నారు. సాధారణంగా మన చెవులు 70 డెసిబుల్‌  వరకు తట్టుకోగలవు. కానీ డీజే సౌండ్‌ బాక్సుల నుంచి 100 నుంచి 130 సెబెల్స్‌ వరకు ధ్వనిని వ్యాప్తి చేస్తున్నాయని అంటున్నారు. ఈ ధ్వని తరంగాలు గుండెకు అనుసంధానంగా ఉండే కర్ణికపై పడుతుందని దీనివల్ల గుండెపోటుకు దారితీస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ధమనుల్లో అధిక రక్తపోటు, ఆర్టీఫీషియల్‌ హైపర్‌ టెన్షన్‌ పెరిగి గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటివి సంభవించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

భాగ్యనగరంలో డీజే సౌండ్స్‌ నిషేధం..సౌండ్‌ పొల్యూషన్‌తో ప్రజలు ప్రాణాలకు ప్రమాదంగా మారిన డీజే సౌండ్‌లను హైదరాబాద్‌లో పోలీసులు నిషేధం విధించారు. మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపుల్లో డీజే సౌండ్స్‌ వినియోగించకూడదని ఉత్సవ కమిటీలకు ఆదేశాలు జారీచేశారు. దీనిపై హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి అమలు చేయాలని ఆదేశించారు. డీజేల కారణంగా వృద్ధులు, చిన్నారులు, హృదయ సంబంధిత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిపై ఫిర్యాదులు పెరగంతో ఈనిర్ణయం తీసుకున్నామని వెల్లడించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం హైదరబాద్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల డీజేలు నిషేదించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కూడా డీజే సౌండ్‌పై నిషేధాజ్ఞలు ఉన్నా పోలీసులకు రాజకీయనేతల ఒత్తిళ్లతో మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందంటున్నారు.