Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడం దాదాపుగా తగ్గిపోయింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దాని పరసర ప్రాంతాలలో కొనసాగుతూ సముద్ర మట్టంపై 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. శనివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కుతోంది.
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రానికి ఆగస్టు 5 వరకు వర్ష సూచన ఉంది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో  కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఆగస్టు 5 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. ఉక్కపోత అధికం కానుంది. అయితే కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడి ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు.





ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు చాలా తక్కువగా ఉంది. శనివారం ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నేడు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. ఆగస్టు 5 నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి జల్లులు పడతాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరో రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.






హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.