Rains In Telangana: నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీ, తెలంగాణలో తగ్గిపోయింది. మంగళవారం కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుంచడగా, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.


తెలంగాణలో ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన ఉంది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, కోట, గుణ, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం రాయ్‌పూర్, పరదీప్ గుండా ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల పై వరకు విస్తరించి ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, యానాంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో నేడు సైతం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతుండగా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. 






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తగ్గింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అర్ధరాత్రి సమయంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఈ నెల చివర్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.






తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. జూలై 23 నుంచి రాష్ట్రానికి మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు.