AP Rains News Today | ఇప్పటికే వరుస వర్షాలతో ఇబ్బందులు పాలవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో చేదు వార్త అందించింది వాతావరణ శాఖ. పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని వలన మంగళవారం (సెప్టెంబర్ 02) నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆదివారం రాత్రి సమయానికి భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 48.1అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11.47 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి 2.25 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా మరో నాలుగు,ఐదు రోజులు ఉండొచ్చని పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రతలు తీసుకోవాలన్నారు.
రానున్న మూడు రోజులు వాతావరణం *సోమవారం(01-09-25)*• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు.
• కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం(02-09-25)•విజయనగరం, పార్వతీపురంమన్యం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.• శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బుధవారం(03-09-25)•పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ,పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఆదివారం రాత్రి వరకూ అల్లూరి జిల్లా అడ్డతీగలలో 70.5మిమీ, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 43.5మిమీ, శ్రీకాకుళం జిల్లా నందిగాంలో 40.5 మిమీ, మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 33మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు ప్రఖర్ జైన్