Ponnavolu Sudhakar Reddy :  సీఐడీ అధికారుల కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామకృష్ణరాజు చేసిన  పిటిషన్ పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని వైసీపీ ఖండించింది. ఆ పార్టీ నేత, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. రఘురామకృష్ణరాజు పదకొండో తేదీన ఫిర్యాదు చేస్తే.. పదో తేదీనే లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లగా చెప్పారని..ఇది ఎలా సాధ్యమని ాయన ప్రశ్నించారు. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయటానికి చేసిన కుట్ర అనటానికి ఇంకేం సాక్ష్యం ఉంటుందని పొన్నవోలు ప్రశ్నించారు.

  


రఘురామన అరెస్టు చేయడంలో తప్పు జరగలదేన్న పొన్నవోలు                               


వైఎస్ జగన్ తో పాటు మరికొందరు అధికారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందన్నారు. ఈ కేసుల వెనుక దురుద్దేశం..రాజకీయ కక్ష మాత్రమే ఉందన్నారు. వ్యక్తిగత ద్వేషంతో రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారన్నారు. సీఐడీ అధికారులు రఘురామను హైదరాబాద్ లో అరెస్టు చేసి ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు ఉంచారని అందులో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. 


అప్పట్లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆరోపణ - ఇప్పుడు జగన్ పేరు చెప్పారు                         


తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ కృష్ణరాజు మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.  ఇప్పుడేమో కేసులో  జగన్ పేరు రాశాన్నారు.  జగన్ పై రఘరామ ద్వేషం పెంచుకుని మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని  అధికారులు పీవీ సునీల్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదని  పొన్నవోలు ప్రశ్నించారు. అప్పట్లోనే కోర్టు రఘురామను వైద్య పరీక్షలకు పంపిందని.. గాయాలేమీ లేవని వైద్యులు నివేదిక ఇచ్చారన్నారు. ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్నే చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని.. మూడేళ్ల తర్వాత రఘురామ కేసులో ‌జగన్, ఇతర అధికారులపై ఎలా కేసు నమోదు చేస్తారని   పొన్నవోలు నిలదీశారు.    ఇబ్బందులు పెట్టాలన్న కక్షతోనే  తప్పుడు కేసు పెట్టారని ఇది వ్యవస్థకు మంచిది కాదన్నారు. అధికారులు ఎవరూ సరిగా ఉద్యోగం చేయలేరని అన్నారు. 


తనపై కస్టోడియల్ టార్చర్ విషయంలో సుదీర్ఘంగా పోరాడుతున్న రఘురామ                                             


రఘురామ తనపై కస్టోడియల్ టార్చర్ విషయంలో సుదీర్ఘంగా పోరాడుతున్నారు. కాల్ రికార్డులు కూడా భద్రపరచాలని హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లీగల్ ఒపీనియన్ తీసుకుని పోలీసులు కేసు నమోదు  చేశారు.