Andhra Liquor Scam Chevireddy PAs Arrest : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు వ్యక్తిగత సహాయకులు బాలాజీ యాదవ్ , నవీన్ కృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు వీరిని పట్టుకున్నారు. లిక్కర్ స్కామ్ లో బాలాజీ యాదవ్ A35గా ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు. ఈ కేసులో కీలక నిందితుడిగా సిట్ అధికారులు చెబుతున్నారు. నవీన్ కృష్ణ A36 నిందితుడిగా ున్నాడు. చెవిరెడ్డి మరో సహాయకుడు. వీరు కేసు నమోదు అయినప్పటి నుంచి పరారీలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విధానంలో అక్రమాలకు సంబంధించినది. మద్యం లైసెన్సులు, డిస్టిలరీల నిర్వహణ, అక్రమ డబ్బు తరలింపు జరిగిందని కేసు నమోదు అయింది. బాలాజీ యాదవ్ , నవీన్ కృష్ణ ఎన్నికల సమయంలో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు రూ. 8.2 కోట్ల అక్రమ డబ్బును తరలిస్తూ దొరికారు. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ ఇద్దరు పీఏలు ఆయన ఆదేశాల మేరకు ఈ అక్రమ లావాదేవీలలో పాల్గొన్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు.
బాలాజీ నవీన్ ఇన్నాళ్లూ ఇండోర్లో దాక్కుని ఉన్నారని, సిట్ రహస్య సమాచారం ఆధారంగా వీరిని పట్టుకుంది. వీరి పై నిఘా ఉంచడంతో నిందితుల్లో ఒకరు.. తండ్రికి ఫోన్ చేశారు. దాంతో ఆచూకీ కనిపెట్టారు. జూన్ 30, 2025న సిట్ అధికారులు ఇండోర్లో ఒక ఆపరేషన్ నిర్వహించి, ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు.. ఇండోర్ పోలీసుల సహకారం అందించారు. అరెస్టు తర్వాత, ఇద్దరు నిందితులను ఆంధ్రప్రదేశ్కు తరలించారు.
ఈ కేసులో రూ. 250-300 కోట్ల అక్రమ నిధులు వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం కోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, మరియు చిత్తూరు జిల్లాల్లోని 43 అసెంబ్లీ మరియు 4 లోక్సభ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లుగా.. ఇదంతా చెవిరెడ్డి చేతుల మీదుగానే నడిచినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. బాలాజీ , నవీన్ ప్రస్తుతం సిట్ ఆఫీసుకు తరలించారు. కోర్టులో ప్రవేశ పెట్టే ముందు విచారణ ద్వారా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి పాత్ర కీలకమని సిట్ నిర్ణయానికి వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , అతని సన్నిహితులపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చర్యలు తీసుకుంది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (A-38), అతని కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (A-39), వెంకటేశ్వర్లు నాయుడు (A-34) నిందితులుగా ఉన్నారు. బాలాజీ, నవీన్ తర్వాత నిందితులుగా ఉన్నారు. వీరిలో ఒక్క మోహిత్ రెడ్డిని మాత్రం అరెస్టు చేయలేదు. ఆయన విచారణకు కూడా హాజరు కావడం లేదు. ముందస్తు బెయిల్ కూడా లభించలేదు. పోలీసులు మోహిత్ రెడ్డి ఆచూకీ తెలియగానే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.