Payyvula Kesav :  ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు అంశం వివాదాస్పదమవుతోంది. 022 నుంచి తొలగించిన ప్రతి ఓటుపై రీవెరిఫికేషన్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన  ఓట్ల తొలగింపుపై తాము చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో ఓట్ల డెలిషన్ చేయమంటే అరెస్ట్ చేయాలన్న నిబంధన ఉందని .. ఎవరైనా ఓట్ల తొలగించినా.. అక్రమంగా తొలగించేందుకు దరఖాస్తు చేసినా అరెస్ట్ తప్పదన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు.                       


మున్ముందు మరింత మందిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుటుందని పయ్యావుల ప్రకటించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల అక్రమ తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని నిశిత పరిశీలన చేయాలని ఆదేశించిందని చెప్పారు.  2022 నుంచి తొలగించిన ప్రతి ఓటుపై రీవెరిఫికేషన్ చేయాలని ఎన్నికల కమిషన్ చెప్పిందని ఈ మేరకు బుధవారమే  స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ఇక బల్క్ గా ఓట్లు తొలగించే ప్రక్రియ ఉండదని స్పష్టం చేశారు.  అలా ఇస్తే ఏఈఆర్ఓ నేరుగా వాటిని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ఇతర అభ్యంతరాలు ఏమైనా బల్క్ గా ఉంటే.. కొన్ని నిబంధనలు ఇచ్చారని పేర్కొన్నారు.               


 ఏఈఆర్ఓ, బీఎల్ఓ, డిప్యూటీ తహసీల్దార్ ముగ్గరి కమిటీతో ఎంక్వైరీ చేసిన తర్వాతనే బల్క్ గా ఓట్లను తొలగించే ప్రక్రియ ఉంటుందని.. ఇప్పటి వరకూ తీసేసిన ఓట్ల విషయంలో  తదుపరి విచారణ జరుగుతుందని, అందరూ బయటకు వస్తారని పయ్యావుల హెచ్చరించారు.  ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులతో ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సాగిందన్నారు. అధికార పార్టీ చెప్పినట్టు ఇప్పటివరకు సాగింది ఇక అలా జరగదని స్పష్టం చేశారు. సస్పెన్షన్ కు గురవుతున్న అధికారులను ఎవరూ కాపాడలేరని తెలిపారు. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ.. ఈసీని ఎవరూ ప్రభావితం చేయలేరని  పయ్యావలు కేశవ్ స్పష్టం చేశారు.                         


జాబితా నుంచి ఓట్లు పోవడం కాదు.. ఉద్యోగుల జాబితా నుంచి తొలగింపులు ఉంటాయని హెచ్చరంచారు.  ఎవరి ఓటు ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది నాయకులు కాదని ఓటర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే పులివెందులలో జగన్ ఓటు ఉండటం నేరమని వైసీపీ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు.  అధికారులు జాగ్రత్తగా పని చేయాలని లేకపోతే అది వారి మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారు. తొలగించిన ప్రతి ఓటుపై నిశిత పరిశీలన చేయాలని ఈసీ ఆదేశించడంతో రాజకీయంగానూ కలకలం రేపుతోంది.