Pawan Kalyan Jindal Plant Visit: చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!
Waste to Energy Plants Andhra Pradesh: పవన్ కల్యాణ్ జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ను సందర్శించారు. గోదావరి పుష్కరాలను క్లీన్గా నిర్వహించడం, డంపింగ్ యార్డ్ లేని ఏపీ లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు.

Dumping Yard free Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ , స్వచ్ఛత దిశగా సరికొత్త అడుగులు వేస్తున్నారు. శనివారం పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ను సందర్శించిన ఆయన, చెత్త నుంచి సంపదను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యంగా రాబోయే గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడంతో పాటు, రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహిత ఏపీగా తీర్చిదిద్దడమే తన ఆశయమని ఆయన స్పష్టం చేశారు.
"చెత్త అనేది వ్యర్థం కాదు.. అది విద్యుత్తును ఇచ్చే ఇంధన ప్రత్యామ్నాయం" అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కొండవీడులోని జిందాల్ ప్లాంట్ను సందర్శించిన సందర్భంగా ఆయన చెత్త నుంచి విద్యుత్తును తయారు చేసే ప్రక్రియను క్షుణ్నంగా పరిశీలించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోందని, దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే ఇంధన అవసరాలు తీరడంతో పాటు పర్యావరణం కూడా పరిరక్షించబడుతుందని అన్నారు. కొండవీడు ప్లాంట్ ద్వారా ఇప్పటికే 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, విశాఖలో 15 మెగావాట్లు ఉత్పత్తి అవుతోందని.. ఇదే తరహాలో కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో మరో 6 ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని వెల్లడించారు.
కాలుష్య రహిత గోదావరి పుష్కరాలకు భారీ ప్లాన్
రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణలో చెత్త, కాలుష్య నిర్వహణపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పుష్కరాలతో నేరుగా సంబంధం ఉన్న 268 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక వర్క్ షాపులు నిర్వహించి అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. నదిలోకి ఎటువంటి వ్యర్థాలు చేరకుండా జిందాల్ అనుసరిస్తున్న ఆధునిక విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారు. నదిని అందంగా, పవిత్రంగా ఉంచేందుకు పంచాయతీలను భాగస్వామ్యం చేస్తూ, నిపుణుల సూచనలతో పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
సింగపూర్, ఇండోర్ మోడల్స్పై అధ్యయనం
చెత్త సేకరణ నిర్వహణలో ప్రపంచ దేశాలు, ఇతర రాష్ట్రాల విజయగాథలను ఏపీలో అమలు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. సింగపూర్లో 90 శాతం చెత్తను కాల్చి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని, అలాగే దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మున్సిపల్ మోడల్ను ఆయన ప్రస్తావించారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును ఏర్పాటు చేయడం ద్వారా మున్సిపాలిటీలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని చెత్తను కూడా సులభంగా ప్రాసెస్ చేయవచ్చని, తద్వారా రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా మార్చవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో చెత్త, కాలుష్య నిర్వహణలో నిపుణుల సూచనలు ఉపయోగించుకుంటాం
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 30, 2026
* పుష్కరాలతో సంబంధం ఉన్న 268 పంచాయతీల్లో ప్రత్యేక వర్క్ షాపులు
* చెత్తను ఇంధన ప్రత్యామ్నాయాలకు వినియోగించుకోవాలి
* గ్రామాల నుంచి నగరాల వరకు చెత్తను వేరు చేసే ప్రక్రియ మారాలి
* డంపింగ్ యార్డులు… pic.twitter.com/YuI1vFY0GL
యువతకు ఉపాధి.. పంచాయతీలకు ఆదాయం
ఈ ప్లాంట్ల ఏర్పాటు కేవలం పారిశుధ్యానికే పరిమితం కాకుండా, ఆర్థిక ప్రయోజనాలను కూడా కల్పిస్తుందని పవన్ కళ్యాణ్ వివరించారు. ఒక మెగావాట్ విద్యుత్ తయారీ ప్లాంట్కు సుమారు రూ. 25 కోట్ల ఖర్చు అవుతుందని, దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే చెత్తను వేరు చేయడం ద్వారా పంచాయతీలు అదనపు ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషించాలని సూచించారు. పూలు, పండ్లు, ఆహార వ్యర్థాల ద్వారా బయో గ్యాస్ ఉత్పత్తి చేసే బయో మిథలైజేషన్ ప్లాంట్లపై కూడా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
"చెత్తను వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన రావాలి" అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ప్రతి గ్రామంలో క్లస్టర్ల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని అధికారులను కోరారు. జిందాల్ ప్లాంట్ ఆపరేషన్స్ హెడ్ ఎం.వి. చారి రూపొందించిన ప్రత్యేక నివేదికపై త్వరలోనే పూర్తిస్థాయి ప్రెజెంటేషన్ ఇవ్వాలని పవన్ కోరారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















