Pawan Kalyan in Ugadi Celebrations: కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఉగాది వేడుకలు చేసుకున్నారు. చేబ్రోలులో కొత్తగా తీసుకున్న ఇంట్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజక వర్గం టీడీపీ ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజక వర్గం బీజెపీ ఇంఛార్జి కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పంచాంగ శ్రవణాన్ని విన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధ్యక్షుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం రాబోతోందని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని మార్చిన కొత్త సంవత్సరంగా ఈ ఏడాది చరిత్రలో నిలవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. అనంతరం పంచాంగ శ్రవణం విని ఉగాది పచ్చడి స్వీకరించారు.






మంగళగిరిలో చంద్రబాబు ఉగాది వేడుకలు


ఉగాది సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. కొత్త ఏడాది మొదటి రోజు, ఈ చైత్ర మాసంలో ప్రజా చైతన్యం కొత్తపుంతలు తొక్కుతూ, మన జీవితాలు ముందుకు తీసుకుని వెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మేలు కలగాలని.. అన్ని రంగాల్లో మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు తీపికబురు అందించారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. వాలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని ఇంతకు ముందే చెప్పామని వెల్లడించారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామనే విషయాన్ని వాలంటీర్లకు తెలియజేశామని అన్నారు.