Pawan Kalyan meets Chandrababu at vundavalli home: అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా భేటీ అయ్యారు. తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. శనివారం డిన్నర్ మీట్ లో భాగంగా చంద్రబాబు, పవన్ భేటీ కాగా, ఇందులో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు. ఇరు పార్టీల కీలక నేతల భేటీ కావడంతో టీడీపీ, జనసేన.. ఉమ్మడి మేనిఫెస్టోపైన, సీట్ల పంపిణీ పైన చర్చించే అవకాశం ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో, ఎక్కడెక్కడ నుండి బరిలోకి దిగాలి అని కీలకంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. మరోవైపు జనసేనకు 40 సీట్లు కచ్చితంగా డిమాండ్ చేయాలని కాపు నేతలు పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భేటీ ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం పేరుతో భోగి మంటలుటీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ 14న భోగి వేడుకల్లో ఉమ్మడిగా పాల్గొననున్నారు. ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమం పేరిట అమరావతి రాజధాని పరిధి గ్రామమైన మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న భోగి వేడుకల్లో ఉదయం 7 గంటలకు పాల్గొంటారు. జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రతులను భోగి మంటల్లో దహనం చేస్తారు. జగన్ మోసపు హామీలు, పెత్తందారి పోకడలు, నిరుద్యోగ సమస్య, గంజాయి మాఫియా, అధిక ధరలు – పన్నుల బాదుడు, జె.బ్రాండ్స్, రైతు సంక్షోభం, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేయనున్నారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన రైతులతో చంద్రబాబు, పవన్ ముచ్చటిస్తారు.