Pawan Kalyan: అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Deputy CM: అవనిగడ్డలో లంక గ్రామాల ప్రజల సమస్యలను తీర్చే వంతెని నిర్మాణానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సాస్కీ నిధులు కూడా కేటాయిస్తామన్నారు.

Pawan gives green signal for bridge construction: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎదురుమొండి దీవుల వాసుల చిరకాల కల ఏటిమొగ, ఎదురుమొండి హై లెవల్ వంతెన నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోపాటు సాస్కీ పథకం నుంచి నిధులు సమకూరుస్తామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో అవుట్ ఫాల్ స్లూయిజ్ ల పునరుద్ధరణకు తక్షణం చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు, నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలపై ఎంపీ వల్లభనేని బాలశౌరి , శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్ , వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవనిగడ్డ ప్రాంతంలో ఉన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ ల సమస్యకు పరిష్కారం చూపుతానని చెప్పారు. అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయిన అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లే అంశంపైనా ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పవన్ స్పషఅటం చేసారు. క కృష్ణా జిల్లాలోనే 60 వేల మందికి పైగా సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. నమోదు చేసుకోని కౌలు రైతుల సంఖ్య కూడా ఉంటుంది. నష్టపోయిన ప్రతి కౌలు రైతుని గుర్తించి వారికి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో కాలువలను సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్ లు పని చేయకపోవడం కారణంగా నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇవి పూర్తిగా పని చేయకుండాపోయాయి. గ్రీజ్ పెట్టడం వంటి కనీస నిర్వహణ పనులకు కూడా నోచుకోలేదు. ఫలితంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లు మొరాయించడం వల్ల సముద్రం పోటెత్తిన ప్రతిసారి ఉప్పు నీరు తమ పొలాలను ముంచెత్తుతుందని తమ సమస్యకు పరిష్కారం చూపమని దివిసీమ రైతులు కోరుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు అవుట్ ఫాల్ స్లూయిజ్ లను పునరుద్ధరించేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని పవన్ తెలిపారు.
అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అవుట్ ఫాల్ స్లూయిజ్ లు పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి వీటికి కేటాయింపులు చేసి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. అవుట్ ఫాల్ స్లూయిజ్ ల సమస్య పరిష్కారానికి అవసరం అయితే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడుతా. నూతనంగా నిర్మించబోయే అవుట్ ఫాల్ స్లూయిజ్ లు దీర్ఘకాలం రైతులకు ఉపయోగపడే విధంగా డిజైన్లు పక్కాగా రూపొందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎదురుమొండి దీవుల్లో నివాసం ఉంటున్న 20 వేల మంది ప్రజల చిరకాల వాంఛ ఏటిమొగ - ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం. కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఈ హైలెవల్ బ్రిడ్జ్ కోసం ఇప్పటికే రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయి. అలైన్మెంట్ లో మార్పుల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిన విషయాన్ని స్థానిక శాసన సభ్యులు తెలియచేశారు. రూ.60 కోట్లు వరకూ నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు సాస్కీ పథకంతో నుంచీ తగిన నిధులు సమకూరుస్తాము. నిర్ణీత కాల వ్యవధిలో ఏటిమొగ – ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.





















