CI Shankaraiah  dismissed from service:   కర్నూలు రేంజ్‌లో  వి.ఆర్. (వేకెన్సీ రిజర్వ్)లో ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) జె. శంకరయ్యను పోలీస్ సర్వీస్ నుంచి డిస్మిస్  చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం క్రమశిక్షణ చర్యల భాగంగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.    సీఐ జె. శంకరయ్య 2018లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పులివెందుల సీఐగా పనిచేశారు. ఆ  సమయంలో, నిందితుల అండతో ఆధారాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. సీబీఐ ఎదుట సాక్ష్యం చెప్పడానికి మొదట అంగీకరించి తర్వాత రివర్స్ అయ్యారు. వైసీపీ హయాంలో ఆయనకు మంచి పోస్టింగ్ లభించింది. ప్రస్తుతం, శంకరయ్య కర్నూలు వి.ఆర్.లో ఉన్నారు. అయితే ఇటీవల వివేకా హత్య కేసు విషయంలో చంద్రబాబు తనపై ఆరోపణలు చేశారని సీఎంకే నేరుగా లీగల్ నోటీసులు పంపించారు. దీంతో  రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్  క్రమశిక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో అంతర్గత విచారణలు, ఆరోపణల పరిశీలన తర్వాత, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం  డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యలు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు విచారణల్లో జరిగిన ఆరోపణలు, ఇతర క్రమశిక్షణ లోపాలపై ఆధారపడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.