YS Viveka Case  :   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని వరుసగా రెండో రోజు సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నించింది. మొదటి రోజు ఎనిమది గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు రెండో రోజు ఆ సమయాన్ని మరో గంట పెంచారు. 9 గంటల పాటు ప్రశ్నించారు. మరో వైపు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కూడా చంచల్ గూడ జైలు నుంచి సీబీఐ ఆఫీసుకు తీసుకు వచ్చారు. వారిని ఇతర గదుల్లో విచారణ జరిపారు. కలిపి విచారణ జరపలేదని తెలుస్తోంది. ప్రశ్నించడానికి కోర్టు ఐదు రోజుల సమయం ఇవ్వడం.. ముందస్తు బెయిల్ పై తుది తీర్పు వచ్చే వరకూ రోజూ సీబీఐ ఆఫీసుకు  హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రతి చిన్న విషయాన్ని సీబీఐ అధికారులు క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 


సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సీబీఐ అధికారులు ప్రశ్నించడం లేదంటూ...  వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని ఆదేశించింది. విచారణను ఆడియో వీడియో రికార్డు చేయాలని స్పష్టం చేసింది. ఆ మేరకు విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డు చేస్తున్నారు. అలాగే అవినాష్ రెడ్డి దగ్గర లిఖిత పూర్వకంగా సమాధానాలు తీసుకుంటున్నారు.                    


మరో వైపు  నిందితుడు దస్తగిరి  అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి  , వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో  విచారణ జరిగింది. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని, దస్తగిరిని సీబీఐ అధికారులు అప్రూవర్‌గా మార్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.  దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దని భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు.. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని నిందితుడు దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.                  


ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి  బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.  . ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో సీబీఐ వాదించింది. వివేకా హత్యకు కుట్ర చేసింది గంగిరెడ్డే అని.. వివేకను హత్య చేసింది గంగిరెడ్డే అని తెలిపింది. సీబీఐ దర్యాప్తుకు ముందు సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడం వల్లే గంగిరెడ్డి బెయిల్ పొందాడని కోర్టుకు సీబీఐ తెలియజేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని.. సుప్రీంకోర్టు పరిశీలన మేరకు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌కు అర్హుడే కాదని సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.  వివేకా హత్యకేసుపై ప్రభావం చూపుతాడని, సాక్షులను బెదిరిస్తాడని ఊహించి గంగిరెడ్డి బెయిల్ రద్దు చెయ్యొద్దని ఆయన తరపు లాయర్ కోర్టును కోరారు.