Amaravati billapproved in Loksabha: లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026కు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు-2026 కు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చలో వైఎస్ఆర్సీపీ మినహా అన్ని పార్టీలు సమర్థించాయి. పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, 2024 జూన్ 2 నుండి అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించేలా ఈ బిల్లులో నిబంధనలను చేర్చారు. ఈ బిల్లు ఆమోదంతో అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించినట్లయింది.
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణీ ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది.#Amaravathi#amaravathiresolution#APCapital#LokSabha#ABPDesampic.twitter.com/jxgHaChesq
ఈ చర్చలో ఇండీ కూటమి అనూహ్యంగా బిల్లుకు మద్దతు ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తరపున మాణికం ఠాగూర్ వంటి నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని ఏర్పాటు ఉండాలని, అమరావతికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. దీంతో బిల్లుపై చర్చలో మెజారిటీ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి సానుకూలత వ్యక్తం చేశాయి.
అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ చర్చకు సమాధానమిస్తూ.. ఏపీ అసెంబ్లీ తీర్మానం మేరకే ఈ సవరణ చేస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రగతికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు , ఇతర విభజన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లును ఆమోదించారు. గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. రాజ్యసభలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి కి పంపుతారు . అక్కడ తుది ఆమోదం తరవాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దాంతో ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది. మళ్లీ మార్చాలంటే.. పార్లమెంట్ లోనే చట్టం చేయాల్సి ఉంటుంది.
