Nithin Gadkari :   తిరుపతి జిల్లాలో 2900 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహింగసభలో ఆయన మాట్లాడారు.  తిరుపతికి వచ్చే రోడ్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాలని  అన్నారు.  8744 కిలోమీటర్ల హైవేలు ఈ ఏడాది తిరుపతి జిల్లాలో నిర్మిస్తున్నామన్నారు. పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెంచడం ద్వారానే పేదరికం నిర్మూలించగలమని తెలిపారు. రోడ్లు, విద్యుత్తు పరిశ్రమ కావాల్సిన సౌకర్యాలు కల్పన తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పోర్టులు అభివృద్ధి చెందితే అభివృద్ధి వేగవంతంగా అవుతుందన్నారు.                                                                     



ప్రభుత్వం కోరడంలో రూ. 25వేల కోట్ల హైవేలు                


రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో రూ.25 వేల కోట్లతో 1200 కిలోమీటర్లు హైవేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు లక్షల కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో హైవేలు నిర్మిస్తామన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ జీడీపీ దేశంలోని అత్యధికం కాబోతోందన్నారు. రోడ్లు మౌలిక సదుపాయాలు పెంపు వల్ల పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు మరింతగా రాబోతున్నాయని తెలిపారు. కడప రేణిగుంట హైవేను అక్టోబర్ 2024 పూర్తి చేస్తామన్నారు. 


తిరుపతిలో  అంతర్జాతీయ స్థాయిలో  ఇంటర్ మోడల్ బస్ స్టేషన్‌                                                       


మదనపల్లి హైవేను జనవరి 2025 పూర్తి చేస్తామని చెప్పారు. నెల్లూరు కృష్ణపట్నం పోర్టు హై వేను త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. పీలేరులో జరుగుతున్న హైవే పనులను జనవరి 2025కి పూర్తి చేస్తామన్నారు. అలాగే ఏర్పేడు హైవే పనులను నవంబర్ 2024లోపు పూర్తి చేస్తామన్నారు. తిరుపతిలో ఇంటర్ మోడల్ బస్ స్టేషన్‌ను హైవే అథారిటీ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామని... ఆ పనులకు త్వరలో ఒప్పందాలు పూర్తి అవుతాయన్నారు. బెంగళూరు టు చెన్నై ఇప్పుడు ఆరు గంటలు పడుతోందని.. హైవే పూర్తి అయితే రెండు గంటల్లో ప్రయాణం పూర్తవుతుందన్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి ఢిల్లీ నుంచి హైవేని ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.