Export Readiness Index: ఎగుమతుల సన్నద్ధత సూచీలో ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని మరోసారి మెరుగుపరచుకుంది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న ఏపీ.. తాజా ర్యాంకింగ్స్ లో మరోస్థానం ఎగబాకింది. ఈ ర్యాంకుల్లో తమిళనాడు 80.89 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. 78.20 పాయింట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 76.36 పాయింట్లతో కర్ణాటక మూడో స్థానంలో, గుజరాత్(73.22), హరియాణ(63.65), తెలంగాణ(61.36), ఉత్తరప్రదేశ్(61.23) ఉన్నాయి. 2020 సంవత్సరంలో ఏపీ స్థానం 20. రెండేళ్లలోనే ఏకంగా 12 స్థానాలు ఎగబాకింది ఆంధ్రప్రదేశ్. ఇక కోస్తాతీరం కలిగిన రాష్ట్రాలు 8 ఉంటే ఈ విభాగంలో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. ఎగుమతుల పాలసీలో 99.52 పాయింట్లతో 4వ స్థానం, ఎగుమతల ఎకోసిస్టమ్ లో 6వ స్థానం దక్కించుకుంది.


ఏపీ నుంచి 8 జిల్లాలు


దేశం నుంచి 2021-22 లో 422 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య ఎగుమతులు జరిగాయి. అయితే అందులో ఏపీ వాటా 4.58 శాతం (19 బిలియన్ డాలర్లు) ఉందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. 127 బిలియన్ డాలర్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. దేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు జరుగుతున్న టాప్ 100 జిల్లాల్లో రాష్ట్రం నుంచి 8 ఉమ్మడి జిల్లాలకు చోటు దక్కింది. విశాఖపట్నానికి టాప్ 10 లో 9వ స్థానం దక్కింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 24వ స్థానం దక్కింది. ఎగుమతులు ఇన్‌ఫ్రాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పనితీరు బాగుందని, అలాగే గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఎగుమతిదారులకు రుణ లభ్యత కూడా భారీగా పెరిగినట్లు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. 


ఏపీ సర్కారు ప్రోత్సాహంకో మెరుగుపడ్డ ర్యాంకు


జిల్లాల వారీగా నిర్దిష్టమైన పాలసీలను రూపొందించి అమలు చేయడం ద్వారా ఏపీ ర్యాంకులు మెరుగు పడ్డట్లు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ జోన్స్, అగ్రిఎక్స్‌పోర్ట్‌ జోన్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఎగుమతిదారుల సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం వర్క్‌షాప్స్, ట్రేడ్‌ ఫెయిర్స్‌ను నిర్వహించిందంటూ నీతి ఆయోగ్ ప్రశంసించింది. టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడంతో అంతర్జాతీయంగా ఏపీ పోటీ పడటానికి దోహం చేసినట్లు తెలిపింది. అది రాష్ట్ర ఎగుమతుల్లో భారీ వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడుల రాక పెరుగుతున్నప్పటికీ.. ఎగుమతుల ఎకోసిస్టమ్ కు అనుగుణంగా వ్యాపార వాతావరణం మెరుగుపరచుకుంటే ఎగుమతుల్లో మరింత వృద్ధి నమోదు చేయవచ్చని సూచించింది. కాగా, ఎగుమతులు పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, సాధిస్తున్న ఫలితాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకులు నిర్ధారిస్తారు. 2020లో 20 స్థానంలో ఉంది ఏపీ. 2021లో 9 ర్యాంకుకు ఎగబాకింది. తాజాగా మరో ర్యాంకు మెరుగుపరచుకుని 8వ స్థానంలో నిలిచింది.