ప్రకాశం జిల్లాలో రాధ అనే వివాహిత హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. బాకీ డబ్బు తిరిగిస్తానని చెప్పి స్నేహితుడు ఫోన్ చేయడంతో వెళ్లిన ఆమె తిరిగి శవమై కనపడింది. అయితే ఆమె ఒంటరిగా ఎందుకు వెళ్లింది, అక్కడ ఏం జరిగింది..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 


అసలేం జరిగింది..?
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకి చెందిన రాధ ఇటీవల అర్థరాత్రి ఇంటినుంచి వెళ్లి శవమై తేలింది. రాధ కుటుంబం నుంచి 80లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. దీనిపై విచారణ ప్రారంభించారు పోలీసులు. రాధ మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. 


హత్యాచారం..?
రాధ మృతదేహంపై తీవ్ర గాయాలు ఉండటం ఆ తర్వాత ఆమెను వాహనాలతో తొక్కించిన ఆనవాళ్లు ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఆమెను క్రూరంగా హింసించినట్టు గుర్తించారు. కేవలం అప్పు వసూలు విషయంలో అవమానం పొందిన వ్యక్తి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అనేది తేలాల్సి ఉంది. అందులోనూ రాధ ఇద్దరు పిల్లల తల్లి. ఆమెపై అత్యాచారం చేయాల్సిన అవసరం నిందితుడికి ఎందుకు ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. రాధ మృతిని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు మాత్రం తెలుస్తోంది. 


తెలంగాణ నుంచి రాధ తన ఇద్దరు పిల్లలతో సొంత ఊరు రావడం, గ్రామంలో అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనే క్రమంలో ఇలా ఇంటినుంచి వెళ్లిపోయి శవంగా తిరిగి రావడం జిల్లాలో సంచలనంగా మారింది. కేవలం బాకీ తీర్చే ఉద్దేశం లేక రాధను కాశిరెడ్డి హత్య చేశాడా, లేక ఇంకేమైనా కారణం ఉందా అనేది తేలడంలేదు. హత్య జరిగి రెండురోజులవుతున్నా ఇంతవరకు అనుమానితులు చిక్కలేదు. పోలీసులు కూడా వారిని ట్రేస్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. 


మరోవైపు రాధ కుటుంబం, పోలీసుల తీరుపై ఆరోపణలు చేస్తోంది. రాధ మిస్సైందన్న ఫిర్యాదు తర్వాత పోలీసులు ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి ఉంటే రాధ బతికి ఉండేదని అంటున్నారు. రాధ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె జిల్లెళ్లపాడు సమీపంలోనే ఉందని పోలీసులు చెప్పారు. దీంరో రాధ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లడంతో ఆమె శవమై కనపడింది. 


రాధ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ఏపీతోపాటు, తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాలకు పోలీసు ప్రత్యేక బృందాలను పంపినట్టు కనిగిరి డీఎస్పీ రామరాజు తెలిపారు. రాధ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కేతిరెడ్డి కాశిరెడ్డిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రతి చెక్‌ పోస్ట్‌లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. కాశిరెడ్డితో పాటు, మరో నలుగురు ఈ హత్యోదంతంలో పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం చేసి హత్య చేశారా.. లేక తీసుకున్న అప్పు అడుగుతుందనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. కాశిరెడ్డి స్నేహితులు, బంధువులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపబుతున్నారు పోలీసులు. 


Also Read: వంతెనపై పొక్లెయినర్‌తో పనులు, ఒక్కసారిగా కూలిన వంతెన, ప్రాణాలతో బయటపడ్డ ఆపరేటర్!


Also Read: వైనతేయ వంతెనపై యువకుడు ఆత్మహత్యా యత్నం - కాపాడిన లారీ డ్రైవర్