ఏపీలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని చంద్రబాబు పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, అసలు జగన్ రైతుల్ని కలిసేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రులు ఎక్కడికెళ్లిపోయారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కౌంటర్ గా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదన్నారు కాకాణి. 


చంద్రబాబు హయాంలో ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం పట్టుకునేదని సెటైర్లు వేశారు కాకాణి. ఆయన పాదం మోపిన చోట అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి ఉండేదన్నారు. అందుకే ఆయన రావొద్దని రైతులు కోరుకునేవారని, ఆయన్ను అధికారానికి దూరం చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు రైతులపేరుతో చంద్రబాబు నంగి నంగి మాటలు మాట్లాడుతూ నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. 


చంద్రబాబు పర్యటన అంతా డూప్ షో అన్నారు కాకాణి. ఆకుపచ్చ కండువా కప్పుకుని వెళ్తే రైతులకు మేలు చేసినట్టా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయాలనుకుంటున్నారని చెప్పారు. పంట నష్టం అంచనా వేయడానికి ముందే చంద్రబాబు రైతుల దగ్గరకు వెళ్లారన్నారు. ఓవైపు వర్షాలు పడుతుండగా మరోవైపు రైతుల ధాన్యం కళ్లాల్లో ఉందని.. దీనిపై రాద్ధాంతం ఎందుకన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టం అంచనా వేసి ప్రతి రైతుకీ న్యాయం చేస్తామన్నారు కాకాణి. 


టీడీపీకి చెందిన ఓ రైతు చేత అబద్దం చెప్పించాలని చంద్రబాబు చూశారని, కానీ ఆ రైతు ప్రభుత్వం వల్ల లబ్ధిపొందారని, అందుకే నిజం చప్పారని వివరించారు కాకాణి. పంటల బీమాకు సంబంధించి చంద్రబాబు ఆరోపణలన్నీ అసత్యాలేనన్నారు కాకాణి. 2022-23 రబీ సీజన్ లో ఉచిత పంటల బీమా కోసం జీఓ 66, 77 లు జారీ చేశామని చెప్పారు. చంద్రబాబుకి  జ్ఞాపక శక్తి ఉండదు కాబట్టే నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోతున్నాడన్నారు. 


గతంలో రైతు బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం, రైతులు.. ఇలా మూడు వాటాలుగా చెల్లించేవారని, కానీ తమ హయాంలో ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఇది సీఎం జగన్ ఘనత అన్నారు కాకాణి. రైతులకు సంబందించిన పంటల భీమా సొమ్ము 715కోట్ల రూపాయలను చంద్రబాబు అప్పట్లో దారి మల్లిస్తే.. తమ ప్రభుత్వం రైతులకు అందించిందని వివరించారు. 


రాష్ట్ర రైతాంగం పట్ల, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసిస్తోందన్నారు కాకాణి. మిల్లర్లతో గత ప్రభుత్వంలో ఉన్న అగ్రికల్చర్ మంత్రి కుమ్మక్కయ్యారని పరోక్షంగా సోమిరెడ్డిపై సెటైర్లు వేశారు. వైసీపీ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి.. వారికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని వివరించారు. రైతాంగానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ, వారికి అండగా ఉంటున్నామని తెలిపారు కాకాణి. 


చంద్రబాబు ఫోటో షూట్స్ కోసం రైతులను కలుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి చెందిన వారి చేత రైతు వేషం వేయించి మాట్లాడిస్తున్నారన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఆదుకుంటామన్నారు. మార్గదర్శకాలను పక్కన పెట్టి ఆఫ్ లైన్ లో ధాన్యాన్ని కొంటున్నామని చెప్పారు. రైతులను రెచ్చగొట్టి.. చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు కాకాణి.