ISRO Launch: తొలి ప్రయత్నం SSLV D1 విఫలమైనా.. రెండోసారి ఇస్రో ఘన విజయంసాధించింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV D2 ని నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 3 ఉపగ్రహాలను విజయవంతంగా వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. SSLV మలి ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో సంబరాలు మొదలయ్యాయి. SSLV మిషన్ డైరెక్టర్ ఎస్.వినోద్ ని ఈ సందర్భంగా అభినందించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. SSLV భారత ఘనతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. గతంలో చేసిన తప్పులను ఐదు నెలల్లో సరిదిద్దుకున్నామని ఆ తర్వాత SSLV D2 ప్రయోగం మొదలు పెట్టామని చెప్పారు.


చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ SSLV. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ తరహాలోనే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే పేరుతో SSLV ప్రయోగాలు మొదలు పెట్టింది. గతేడాది ఆగస్ట్ లో మొదటి ప్రయోగం చేపట్టింది. ఆగస్ట్ నెల 7వ తేదీన ప్రయోగించిన SSLV-D1 సాంకేతిక కారణాలవల్ల విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశ పడ్డారు. అయితే ఆ తర్వాత ఆ ప్రయోగం విఫలమవడానికి గల కారణాలు తెలుసుకొని తప్పులు సరిదిద్దుకొని ఈ సారి ప్రతిష్టాత్మకంగా రెండో ప్రయోగం చేపట్టి విజయవంతమైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్ లో భారత్ దూసుకుపోవడానికి మార్గం సుగమం అయింది. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశాలుకు సంబందిచిన చిన్న ఉపగ్రహాలను  అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సాధించింది.


శ్రీహరికోటలోని సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక SSLV D2ప్రయోగాన్ని చేపట్టారు. ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ షార్‌ లోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. గురువారం రిహార్సల్స్‌ నిర్వహించి, రాకెట్‌ పనితీరు బాగున్నట్లు నిర్ధారించారు. షార్‌ లోని బ్రహ్మ ప్రకాష్‌ హాలులో డాక్టర్ సోమనాథ్ రాకెట్‌ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత భాస్కర కాన్ఫరెన్స్ హాల్ లో లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌) సమావేశం కూడా పూర్తయింది. ఈ రెండు సమావేశాల్లో అంతా పక్కాగా ఉన్నట్టు నిర్థారించుకుని రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు రాకెట్ ప్రయోగం కూడా సక్సెస్ అయింది.


కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఈ రోజు (శుక్రవారం) వేకువజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటలపాటు కొనసాగాక.. ఉదయం సరిగ్గా 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక SSLV D2 నింగిలోకి దూసుకెళ్లింది.


ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల EOS -07 ఉపగ్రహంతో పాటు అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్‌-1, చెన్నై స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు 750మంది కలసి రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్‌-2ను భూ సమీప కక్ష్యల్లో ఈ రాకెట్ ప్రవేశ పెట్టింది.


రాకెట్‌ ప్రయోగం మొత్తం 15 నిమిషాల్లో పూర్తయింది. భూ ఉపరితలానికి 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో మొదటగా EOS -07ను రాకెట్ కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత 880 సెకన్లకు జానుస్‌-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీశాట్‌ ను కక్ష్యలో ప్రవేశపెట్టింది.