ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మరో మలుపు తిరిగింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడిని ఈడీ అరెస్టు చేసింది. గత వారం రోజులుగా ఈ కేసుతో సంబంధం ఉన్న వేర్వేరు వ్యక్తులను రోజుకొకర్ని అరెస్టు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఎంపీ కుమారుడిని అందులోనూ అధికార పార్టీకి చెందిన ఎంపీ కుమారుడిని అరెస్టు చేయడం కలకలం రేపింది. 


గత కొన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. తాజాగా ఇవాళ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాగుంట రాఘవను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు. ఇప్పటికే అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారంతో ఈయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న విచారణకు పిలిచిన ఈడీ అధికారులు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అరెస్టు చేశారు.


ఈ స్కామ్‌ కేసులో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీ కేంద్రం పని చేసే చారియట్‌ మీడియాకు చెందిన రాజేశ్‌ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు ఈయన తరలించారని రాజేశ్ జోషిపై ఆరోపణలు ఉన్నాయి. తమ ఆధీనంలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. రాజేష్ జోషిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు.


అంతకు ముందు రోజు హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఈయన గతంలో ఎమ్మెల్సీ కవితతోపాటు ఈ స్కాంలో ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తుల వద్ద సీఏగా పని చేశారు. రామచంద్ర పిళ్లైకి కూడా చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేశారు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. బుచ్చిబాబు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. గతంలో ఆయన ఇంట్లో సోదాలు కూడా చేసింది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. కేసులో ఇప్పటి వరకు సాగిన విచారణ, ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించి బుచ్చిబాబు పాత్రపై నిర్దారణకు వచ్చినట్టు సమాచారం. అందుకే ఈ ఉదయం తెల్లవారేసరికి బుచ్చిబాబును అరెస్టు చేసింది సీబీఐ.  


ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్‌ మల్హోత్రాను కూడా ఈడీ అధికారులు ఫిబ్రవరి 8 అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతణ్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 


ఎన్నో మలుపులు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ ఈ మధ్యే వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ, ఈ విషయం స్పష్టం చేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం, ఆప్‌ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది ఆప్. ఈ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులు అందేలా చూశారని ఈడీ తెలిపింది. ఆ చార్జ్‌షీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా చేర్చింది. కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 17 మంది నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది ఈడీ. మొదటి ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చిన ఈడీ ఈసారి ఏకంగా కేజ్రీవాల్ పేరునీ జోడించింది.