Every Year DSC in Andhra Pradesh: ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేష్ ప్రకటించారు.  రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామన్నారు.  ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని అధికారులకు సూచించారు. 

సంస్కరణలు వేగంగా అమలు 

ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేశామని లోకేష్ గుర్తు చేశారు.  సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలే. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉంది.  అసర్ నివేదిక ప్రకారం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) ప్రోగ్రామ్ అమలులో జాతీయస్థాయిలో రాష్ట్రం 14వస్థానంలో ఉంది, ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రతి బిడ్డకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక హక్కుగా ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించడమే లక్ష్యంగా పనిచేద్దాం అని మంత్రి అన్నారు. 

స్కూళ్లను దత్తత తీసుకునే కార్యక్రమం 

తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేశాం, చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ. 325కోట్లు విడుదల చేశాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి, ఉత్తమమైన ప్రీస్కూల్ పాలసీని సిద్ధంచేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశ, విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు, దాతల సహకారం తీసుకోవాలి. ఆసక్తిగల తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ఆయా స్కూళ్లకు అవసరమైన మౌలికసదుపాయాలతో ప్రత్యేకమైన వెబ్ సైట్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు.  జాతీయస్థాయిలో పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలి. రాష్ట్రంలోని అనంతపురం, నెల్లూరు, ఏలూరు, కడప చిత్తూరులలో ఆధునీకరించిన సైన్స్ సెంటర్లను త్వరగా ప్రారంభించి, విద్యార్థులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దండి. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 125 ఆటిజం సెంటర్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి, ఏడాదిలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  

దేశంలోనే అత్యుత్తమంగా సెంట్రల్ లైబ్రరీ

దేశంలోనే అత్యుత్తమ మోడల్ తో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపట్టాలని లోకేష్ ఆదేశించారు.   2లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేస్తున్న ఈ లైబ్రరీ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డి. విశాఖపట్నం జగదాంబ సెంట్రల్ లో ప్రతిపాదించిన రీజనల్ లైబ్రరీని 50వేల అడుగుల్లో నిర్మించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు.  ఉమ్మడిజిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం 13మాత్రమే జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా గ్రంధాలయాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ గ్రంథాలయాలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ కామన్ సాఫ్ట్ వేర్, వెబ్ సైట్ రూపొందించాలన్నారు. .  

సెస్సు నిధులతో లైబ్రరీల అభివృద్ధి

స్థానిక సంస్థలనుంచి సుమారు రూ.213 కోట్ల రూపాయల మేర సెస్సు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని రాబట్టి లైబ్రరీలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ లైబ్రరీల్లో విజ్జానవంతమైన కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలి.  నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరీ నుంచి రాష్ట్రానికి మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో రాజమండ్రి గ్రంథాలయానికి రూ.87లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వ లైబ్రరీల్లోని పుస్తకాలతో ప్రిపేరైన 350మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు లభించాయి. లైబ్రరీల వల్ల కలిగే ప్రయోజనాలపై పెద్దఎత్తున క్యాంపెయిన్ నిర్వహించాలని సూచించారు.