Nagababu Emotional Post On Ahmedabad Plane Crash: గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తమను తీవ్రంగా కలిచివేసిందని.. బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. నటుడు, జనసేన నేత నాగబాబు ఈ ప్రమాదంపై ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఆ ఫ్లైట్ యాక్సిడెంట్..

అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ తనను తీవ్రంగా కలిచివేసిందని నటుడు నాగబాబు అన్నారు. 'చాలా ఏళ్ల క్రితం అన్నయ్య, మా స్వీటీ పాప, ఎంతోమంది ఫిల్మీ పర్సనాలిటీస్ ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతిలో ఎక్కడో ల్యాండ్ అయ్యింది. పొలాల్లో విమానం ల్యాండ్ అయ్యిందని తెలిసి అన్నయ్య, మా స్వీటీ ఎలా ఉన్నారో? అందరూ సేఫ్‌గా ఉన్నారో లేదోనన్న ఆందోళన నా మనసు కలిచివేసింది. అన్నయ్య, స్వీటీ పాప, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లంతా సేఫ్ అని తెలిశాక నా మనసు కుదుటపడింది. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ ఎఫెక్ట్ ఇంకా నా మనసు నుంచి పోలేదు. అలాంటిది ఈ రోజు అహ్మదాబాద్‌లో జరిగిన ఫ్లైట్ క్రాష్ విజువల్స్ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది.' అంటూ రాసుకొచ్చారు.

పీడ కలైతే బాగున్ను

'ఎంతోమంది యువకులు ఎన్నో ఆశలతో ఈ ఫ్లైట్ ఎక్కారో?, ఎంతమంది పెద్దలు తమ రిటైర్మెంట్ జీవితాన్ని అద్భుతంగా ఊహించుకుంటూ ఈ ఫ్లైట్ ఎక్కారో?, బిడ్డల దగ్గరకు చేరాలనుకున్న తల్లులు, అమ్మ ఒడిలో పసి బిడ్డలు, ప్రయాణీకులని సేఫ్ డెస్టినేషన్‌కి చేర్పించి తన ఆత్మీయులతో  గడపాలని ఊహల్లో ఉన్న పైలట్ కో పైలేట్ ఇతర క్రూ మెంబర్స్. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మెడికోలు. ఎన్నో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఒక ఫ్రాక్షన్ సెకండ్‌లో ఇదంతా ఒక పీడకల అయితే ఎంత బాగుంటుంది అనిపించింది. గొంతును ఎవరో నొక్కుతున్నట్లు తలని ఒక రాకాసి హస్తంతో పిసుకుతున్నట్లుగా ఓ రకమైన నిస్తేజ స్థితిలో ఉండిపోయాను. దేవుడున్నాడని నమ్మే అన్ని మతాల వాళ్లు ఆ ఫ్లైట్‌లో ఉండే ఉంటారు. ఈ దేవుళ్లు ఏమైపోయారు ఎందుకు కాపాడలేకపోయారు? అనిపిస్తుంది. ఈ శతాబ్దానికి ఇంత కన్నా పెద్ద ఆపద రాదు రాకూడదు కూడా. చనిపోయిన వాళ్లకి కన్నీళ్లతో బాధాతప్త హృదయంతో నివాళి. వారి ఆత్మలకు శాంతి చేకూరాలి.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Also Read: అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్... పవన్ నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకు... ఘటన పట్ల టాలీవుడ్ సెలబ్రిటీల దిగ్భ్రాంతి

గుజరాత్ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వైద్య కళాశాలపై ఫ్లైట్ కూలడంతో మరో 24 మంది మృతి చెందారు. ఈ ఘటన యావత్ దేశాన్నే తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘోర విషాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.