MLC Anantha Babu Bail Cancelled: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ కు రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేస్తూ బుధవారం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి తీవ్రమైన ఆరోపణలు నిరూపణ కావడంతో, న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో అనంతబాబు ఇప్పుడు విచారణ పూర్తయ్యే వరకు జైలులోనే రిమాండ్ ఖైదీగా కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాక్షులపై బెదిరింపులే కొంపముంచాయి !
ఈ కేసులో సాక్షులుగా ఉన్న నలుగురిని అనంతబాబు తీవ్రంగా ప్రలోభపెట్టడమే కాకుండా, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తానని హెచ్చరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసేటప్పుడు సాక్షులను ప్రభావితం చేయకూడదు అనే నిబంధనను పెట్టింది. అయితే, అనంతబాబు ఈ నిబంధనలను ఉల్లంఘించారంటూ బాధితుల ఫిర్యాదుతో కాకినాడ సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆనాటి నుండి ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నారు. తాజాగా బెయిల్ రద్దు కావడంతో ఆయనకు బయటకు వచ్చే దారులు మూసుకుపోయాయి.
కోర్టు ఆగ్రహం.. మే 20 నుంచి రెగ్యులర్ విచారణ
బెయిల్పై ఉండి వ్యవస్థను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించడంపై గతంలోనే న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి ప్రవర్తన సాక్షుల భద్రతకు ముప్పుగా మారిందని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 20 నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నిందితుడు బయట ఉంటే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ళ సుబ్బారావు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.
ఏమిటీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు?
మే 2022లో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను అనంతబాబు హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని బాధితుడి ఇంటి వద్దే డోర్ డెలివరీ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, దళిత సంఘాలు , ప్రతిపక్షాల పోరాటంతో పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేశారు. పోలీసులు చార్జిషీటు సమయానికి దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం అనంతబాబును మళ్ళీ కటకటాల వెనక్కి నెట్టేలా చేశాయి. మే 20 నుండి ప్రారంభం కాబోయే విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని బాధితుడి కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
