Ysrcp News :  చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలైన సందర్భంగా పొట్టేళ్లను బలివ్వడంపై అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు  విడుదల సందర్భంగా టీడీపీ నాయకులు జంతు బలి ఇవ్వడం దారుణమన్నారు.  కోర్టులు ఎక్కడా చంద్రబాబు నేరం చేయలేదని చెప్పలేదన్నారు.  చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని  టీడీపీ శ్రేణులు విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు.  చంద్రబాబు విషయంలో న్యాయం గెలిచిందా? రోగం గెలిచిందా? అని ప్రశ్నించారు. మానవతా దృక్పదంతోనే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు. 


చంద్రబాబు చిత్ర పటానికి పొట్టేళ్ళను బలి ఇచ్చి....రక్తం పూసి హేయమైన కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.  చంద్రబాబు బయటకు రాగానే జంతు బలులు ఇస్తున్నారు.... చంద్రబాబుకు అధికారం వస్తే ఇంకెంత మందిని బలి ఇస్తారో అని అనుమానం వ్యక్తం చేశారు.  శాశ్వతంగా జైలులో ఉండాల్సిన చంద్రబాబు... నాలుగు వారాలు వైద్యం కోసం మాత్రమే బయటకు వచ్చారని అన్నారు.  చంద్రబాబు ఇంకొక పదిహేనేళ్లు బతకాలి...జగన్ సీఎంగా ఉండాలన్నారు.  చంద్రబాబు బతికి ఉన్నంత కాలం....ప్రజలు జగన్ ను సీఎంగా గెలిపిస్తారని జోస్యం చెప్పాపు.  వైద్యం కోసం బయటకు వచ్చిన చంద్రబాబు తిరిగి ఆరోగ్యంగా జైలుకు వెళ్ళాల్సి ఉందన్నారు.  2024 కురుక్షేత్ర యుద్దంలో కౌరవులకు పట్టిన గతే...టీడీపీ కి పడుతుందన్నారు.  తప్పు చేసిన వాళ్ళు బయట తిరిగితే....ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయి ఈ దేశం పాకిస్థాన్ లా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.                        


చంద్రబాబు జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సందర్భంగా అనంతపురం జిల్లాలో వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. అందరూ బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని పసుపు రంగు చల్లుకొని సంబరాలు చేసుకుంటే.. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిద్దరాంపురం గ్రామంలో మాత్రం పొట్టేళ్లను నరికి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తే పొట్టేళ్లు నైవేద్యంగా పెడతామని గ్రామ ప్రజలు మొక్కుకున్నారు. మంగళవారం చంద్రబాబు విడుదల సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున పొట్టేలను నరికి గ్రామస్తులు సంబరాలు చేస్తున్నారు. చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు.                                      


అనంతపురం నగరంలో చంద్రబాబు బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా టీడీపీ యువకులు స్కార్పియో వాహనంపై క్రాకర్స్ తో సంబరాలు చేసుకున్నారు. తారాజువ్వల పెట్టెను స్కార్పియో వాహనంపై ఉంచి వెలిగించి, డ్రైవ్ చేస్తూనే వాటిని పేల్చారు. ఈ దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీనిపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.