AP Minister Narayana News in Telugu | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు పలు కీలక శాఖలపై కసరత్తు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన శాఖలపై సంబంధిత మంత్రులు అధికారులతో  సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగూరు నారాయణ  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆరా తీశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి  ఇప్పటికే పదేళ్లు పూర్తయింది. రాష్ట్ర పునర్విభజన  చట్టంలో పేర్కొన్నట్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసిపోయింది. అయినా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఆస్తుల విభజన అంశం ఇప్పటికీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 


ఆస్తుల పంపకంలో వివాదం
ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు ఉన్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.  ముఖ్యంగా తొమ్మిది, పదో షెడ్యూల్ లో ఉన్న సంస్థల మధ్య విభజన ఇంకా పూర్తి కాలేదు.  ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఏపీ తెలంగాణ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలని ఉంది. విభజన తర్వాత  పంపకాల విషయంలో ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ సర్కార్ కొత్త అంశాన్ని తెర పైకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పటికీ కొన్ని సంస్థలు విషయంలో చిక్కుముడి వీడడం లేదు. ఇలాంటి సంస్థల్లో మున్సిపల్ శాఖకు చెందిన కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. అలాంటి సంస్థలపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష చేశారు. విజయవాడలోని సీఆర్ డీఏ ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ బోర్డు, సంబంధిత అధికారులతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు. 


తెలంగాణ నుంచి రావాల్సినవి రూ.5170కోట్లు
హైదరాబాద్ లో ఉన్న ఏపీ హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆస్తులను గతంలోనే ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన విభజించారు. విభజన ఎలా చేయాలనేది అందుకు సంబంధించిన ప్లాన్ కూడా అధికారుల కమిటీ ముందుంచారు. సదరు ప్లాన్ ను పరిశీలించిన తర్వాత నిపుణుల కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది.  ఈ సిఫార్సులను ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లగా...  అక్కడ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి సుమారు 5170 కోట్ల రూపాయలు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఆయా సంస్థల ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు, హై కోర్టుల్లో ఉన్న కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.