Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Potti Sriramulu Statue | అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

అమరావతి: భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి, ఆత్మార్పణతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరిస్తూ అమరావతిలోని శాఖమూరు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు దీక్షకు గుర్తుగానే 58 అడుగుల విగ్రహాన్ని 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్తో నిర్మించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను అభినందిస్తూ, గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉందని, గోదావరి పుష్కరాల నాటికి పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం తొలి అడుగు వేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ప్రశంసించారు. ఆయన త్యాగానికి నివాళిగా రాష్ట్రంలో జల్జీవన్ మిషన్ పనులకు ‘అమరజీవి జలధార’గా నామకరణం చేశామన్నారు. నీళ్లు తాగినప్పుడు ఆయన మనకు గుర్తుకు రావాలన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడి విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు.

యువగళం హామీని నేరవేర్చాను.. మంత్రి నారా లోకేష్..
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరిస్తూ, అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటు చేసిన 'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. యువగళం హామీ నెరవేర్చానని లోకేష్ పేర్కొన్నారు.
అమరావతిలో 'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ
పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలో భారీ కాంస్య విగ్రహాన్ని ఈ విగ్రహం కేవలం ఒక శిల్పం మాత్రమే కాదని, తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీని కేవలం 194 రోజుల రికార్డు సమయంలోనే నెరవేర్చడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

త్యాగానికి నిలువెత్తు రూపం
పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన దీక్షా కాలాన్ని గుర్తు చేస్తూ ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో నిర్మించారు. "ఒక మనిషి త్యాగం.. ఒక జాతి గౌరవం.. ఒక దీక్ష.. ఒక రాష్ట్రం" అంటూ లోకేష్ ఆయనను కొనియాడారు. ఈ విగ్రహం తెలుగువారి గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిత్య పోరాట యోధుడు
పొట్టి శ్రీరాములుగారు ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదని, సమాజాభివృద్ధి కోసం ఒక సామాన్య కార్యకర్తలా పనిచేశారని లోకేష్ గుర్తు చేశారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, అంటరానితనంపై పోరాడి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారని తెలిపారు. రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన నిశ్చల దీక్షా దక్షత నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

భారతదేశ చరిత్రపై ప్రభావం
ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పొట్టి శ్రీరాములు గారిని 'భారతదేశ మెర్కాటర్' గా అభివర్ణించారని లోకేష్ గుర్తు చేశారు. మెర్కాటర్ ప్రపంచ పటాన్ని రూపొందిస్తే, శ్రీరాములు గారి బలిదానం తర్వాతే భారతదేశ చిత్రపటంపై భాషా ప్రయుక్త రాష్ట్రాల రేఖలు ఏర్పడ్డాయని వివరించారు. ఆయన త్యాగం వల్లే నేడు మనం తెలుగువారిమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని పేర్కొన్నారు.
స్మృతి వనం - భవిష్యత్తు ప్రణాళికలు
శాఖమూరులో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ స్మృతి వనం మొదటి దశ పనులు పూర్తయ్యాయని, రాబోయే 12 నెలల్లో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే, పొట్టి శ్రీరాములు గారి పేరు మీద స్మారక నాణెం విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















