Amaravati Bill Gates: అమరావతికి బిల్ గేట్స్ - పుల్ బిజీ షెడ్యూల్ ఇదే
Microsoft founder Bill Gates : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16వ తేదీన అమరావతి వస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు.

Microsoft founder Bill Gates is coming to Amaravati: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్తో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడంతో పాటు మరిన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అంశంపై ఈ బృందం చర్చించనుంది.
పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం బిల్ గేట్స్ రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని సందర్శించి.. పాలనలో అత్యాధునిక సాంకేతికతను ఏ విధంగా వాడుతున్నారో స్వయంగా పరిశీలిస్తారు. డేటా అనలిటిక్స్ , ఏఐ (AI) వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే విధానాలను ముఖ్యమంత్రి స్వయంగా గేట్స్కు వివరించనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై ఒక ప్రత్యేక ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు.
ప్రజారోగ్య రంగంలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు, మెడ్ టెక్ , డయాగ్నస్టిక్ సేవలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కుప్పం వంటి చోట్ల పైలట్ ప్రాజెక్టుగా విజయవంతమైన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ఆయన ముందు ఉంచనుంది. సాంకేతికత ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిగతులను ముందే అంచనా వేసి మెరుగైన వైద్యం అందించడమే ఈ సంజీవని ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.
కేవలం ఐటీ , వైద్యం మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను కూడా బిల్ గేట్స్ పరిశీలించనున్నారు. ఉండవల్లి సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ డ్రోన్లు , ఏఐ టెక్నాలజీ సాయంతో సాగు చేస్తున్న విధానాన్ని చూస్తారు. పురుగుమందుల పిచికారీ, భూసార పరీక్షలు, పంట దిగుబడి అంచనా వేయడంలో సాంకేతికత ఎలా తోడ్పడుతుందో రైతుల ద్వారా నేరుగా తెలుసుకోనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులపై కూడా ఈ పర్యటనలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు , బిల్ గేట్స్ మధ్య ఉన్న అనుబంధం దాదాపు మూడు దశాబ్దాల నాటిది. 1990వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఢిల్లీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు ఎంతో శ్రమించారు. కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చిన గేట్స్కు.. చంద్రబాబు తన ల్యాప్టాప్లో ప్రజెంటేషన్ ఇచ్చి అబ్బురపరిచారు. ఆ 10 నిమిషాల సమావేశం కాస్తా 45 నిమిషాల పాటు సాగింది. చంద్రబాబు విజన్ చూసి ఆశ్చర్యపోయిన బిల్ గేట్స్.. అమెరికా వెలుపల మైక్రోసాఫ్ట్ తన మొట్టమొదటి డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. అదే హైదరాబాద్ ఐటీ రంగానికి పునాదిగా నిలిచింది. ఈ ప్రారంభ పరిచయం కాలక్రమేణా ఒక బలమైన స్నేహంగా మారింది. ప్రపంచ ఆర్థిక సదస్సు వంటి వేదికలపై వీరు తరచుగా కలుస్తూ ఐటీ , టెక్నాలజీ అంశాలపై చర్చించుకునేవారు. కేవలం వ్యాపార సంబంధమే కాకుండా.. సామాజిక బాధ్యతలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం.. వ్యవసాయం.. విద్యారంగాల్లో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల దావోస్ సదస్సులో కూడా బిల్ గేట్స్ తన ఆత్మకథ సోర్స్ కోడ్ పుస్తకాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చి తన గౌరవాన్ని చాటుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో కూడా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కోరడం ద్వారా వీరిద్దరి ప్రయాణం ఇప్పుడు ఏఐ ,అత్యాధునిక సాంకేతికత దిశగా సాగుతోంది.























